నర్సాపూర్ రూరల్: జీవితంపై విరక్తి చెందిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన మోతిపోలే గంగాధర్ కుమారుడు శివశంకర్(18) నర్సాపూర్లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీలో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి అద్దెకు ఉంటున్నారు. మంగళవారం తనకు ఆరోగ్యం బాగోలేదని కళాశాలకు రానని చెప్పగా, తనతో ఉంటున్న విద్యార్థులు వెళ్లారు. మధ్యాహ్నం గదికి గడియ పెట్టుకొని తాడుతో ఉరివేసుకున్నాడు. కళాశాలకు వెళ్లిన విద్యార్థులు వచ్చి తలుపులు తీయమని పిలిచినా పలకకపోవడంతో చుట్టు పక్కల వారి సహాయంతో గది తలుపులను ధ్వంసం చేసి తెరిచారు. అప్పటికే శివశంకర్ మృతి చెంది ఉన్నాడు. కాగా ఇన్స్ట్రాగామ్లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోస్ట్ పెట్టాడు. తాను మృతి చెందిన అనంతరం తన అవయవాలను ఇతరులకు దానం చేయాలని కోరాడు. శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు ఎస్సై తెలిపాడు.


