జిన్నారం (పటాన్చెరు): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన తాటి చెట్ల రవి(22) నగరంలోనే ఉంటూ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి పయనమయ్యాడు. మార్గమధ్యలో అన్నారం ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్దకు రాగానే బైకు ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో రవికి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సావిత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
వట్పల్లి(అందోల్): అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన అందోలు మండల పోసానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నరేందర్ (57)కు వారసత్వంగా 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా తాను చేసిన అప్పులకు ధారాదత్తం చేయడంతో వారం రోజుల క్రితం తీవ్ర మనస్తాపానికి గురై క్రిమి సంహరక మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.


