వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ధర్నా
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
తోటి కార్మికుడి హత్య
● నిందితుడి పరారీ ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ ● నిందితుడి కోసం పోలీసుల గాలింపు
సదాశివపేట(సంగారెడ్డి): అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే చికిత్స చేసి మహిళ మృతదేహాన్ని అప్పగించారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా మునిపిల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు జగదీశ్ భార్య అన్నపూర్ణ(42) ఈనెల 22న అనారోగ్యంతో సదాశివపేట పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరింది. వారం రోజుల పాటు చికిత్స చేసిన వైద్యులు ఆరోగ్యం మెరుగుపడిందని గురువారం డిశ్చార్జ్ చేస్తామని బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు అన్నపూర్ణ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆస్పత్రి సిబ్బంది తమ తప్పేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరకు రాజకీయ నాయకులు, పోలీసులు రంగ ప్రవేశంతో ఆస్పత్రి యజమాన్యంతో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామ ని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమనిగింది.
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు అధిక దిగుబడులిచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచించారు. గురువారం మండలంలోని రాయిలాపూర్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐఐఆర్ఆర్ రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బస్వరాజ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, ఎన్బీపీజీఆర్ హైదరాబాద్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రణుష, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి గ్రామంలో వానాకాలం పంటల సాగు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. పంటలు సాగు చేసేముందు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. కార్బండిజమ్తో విత్తనశుద్ధి చేయాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వరిలో అధిక దిగుబడిని ఇచ్చే సన్నరకం ఏఎన్ఎం 1638, దొడ్డురకం భాగ్యనగర్ ధాన్–75 సాగు చేయాలన్నారు. ప్రతి రైతు ఫార్మర్ ఐడీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓలు సౌజన్య రైతులు పాల్గొన్నారు.
రాయిలాపూర్లో పంటలసాగుపై అవగాహన
మనోహరాబాద్(తూప్రాన్): తోటి కార్మికుడిని హత్య చేసి పరారైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... కేరళకు చెందిన నలీనికుమార్(40), వారం రోజుల క్రితం కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేయడానికి మండలంలోని కాళ్లకల్ శివారులో ఉన్న కిషాన్ ఇండస్ట్రీస్కు వచ్చి పరిశ్రమ గదుల్లో ఉంటున్నాడు. కాగా అదే పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన మరో కార్మికుడు వడియాత నరేష్ సైతం నలీన్కుమార్ గదిలోనే ఉన్నాడు. ఉదయం గది తలుపులు తెరవకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా నలీనికుమార్ రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. హత్య చేసి పరారైన నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా మృతుడిని ఎందుకు హత్య చేశాడో వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి


