400 ఎంపీ సీట్లు గెలుస్తాం | - | Sakshi
Sakshi News home page

400 ఎంపీ సీట్లు గెలుస్తాం

Mar 12 2024 8:50 AM | Updated on Mar 12 2024 1:27 PM

కేంద్రమంత్రిని సన్మానిస్తున్న నాయకులు - Sakshi

కేంద్రమంత్రిని సన్మానిస్తున్న నాయకులు

సంగారెడ్డి : దేశంలో మోదీ హవా కొనసాగుతుందని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘవాల్‌కు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లోనే కాదు 2029లో సైతం బీజేపీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విద్యావంతులు, మేధావులు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో నిలబడే బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బార్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాదుల సంరక్షణ చట్టంతో పాటు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, భగవాన్‌రావ్‌ పాటిల్‌, టీ.సత్యనారాయణ, నవాజ్‌, సమరసింహారెడ్డి, శ్రీనివాస్‌, దత్తాత్రి, సురేందర్‌, రామ్మోహన్‌, బాలరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రికి ఘన స్వాగతం

రామచంద్రాపురం(పటాన్‌చెరు) : సంగారెడ్డిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘవాల్‌కు సోమవారం రామచంద్రాపురంలో బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాజు బీజేపీలో చేరారు. అనంతరం కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పాల్గొన్నారు.

కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘవాల్‌

Advertisement
 
Advertisement
Advertisement