గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

Jan 29 2024 5:56 AM | Updated on Jan 29 2024 9:01 AM

పాపన్నపేట(మెదక్‌): మండల పరిధిలోని మంజీర నదిలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్సై డి.మహిపాల్‌ రెడ్డి తెలిపారు. పొడిచన్‌పల్లి గ్రామ శివారులో సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభించిందన్నారు. చేపల వేటకు వెళ్లి చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతుడు తెల్లటి దోవతి, పసుపు పచ్చ షర్ట్‌ ధరించి ఉన్నాడని వివరించారు.

అనుమానాస్పద స్థితిలో..

రామచంద్రాపురం(పటాన్‌చెరు): అనుమానస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం భారతీనగర్‌ డివిజన్‌ పరిధిలోని హెచ్‌ఐజీ కాలనీ గేటు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌ని పిలిపించి పరీక్షించగా ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 50 ఏళ్లు నుంచి 60 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వంటిపై పసుపు, నలుపు రంగు షర్టు, గ్రే రంగు ప్యాంట్‌ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

వ్యవసాయ భూమిలో..

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌– రాయిపల్లి రోడ్డులోని ఖేడ్‌ మండలం జూకల్‌ శివారులో అంత్వార్‌ గ్రామానికి చెందిన పుప్పాల మాణయ్య వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement