
ఫేస్బుక్, ఇన్ స్ట్రాగామ్తో మెటా సక్సెస్
ఇప్పుడు ‘తెర’ మీదకు వాట్సాప్ యాడ్స్
అత్యధిక యూజర్లు ఉన్నది భారత్లోనే
ప్రకటనలతో అంచనాలను మించి ఆదాయం
టెక్నాలజీ దిగ్గజం మెటా.. ‘వాట్సాప్ యాడ్స్’పె దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో రారాజైన వాట్సాప్లో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్టు ఈ అమెరికన్ దిగ్గజం ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్ను ‘తెర’పైకి తెచ్చింది. వాట్సాప్ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 85 కోట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జనంతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్న వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. అందుకేనేమో.. చాలా సంవత్సరాలుగా ప్రకటనలు లేకుండానే కొనసాగించిన మెటా కంపెనీ ఎట్టకేలకు వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.
యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్్ట సందేశాలతోపాటు స్టేటస్ ఫీచర్లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్స్ట్ వీడియోల రూపంలో కంటెంట్ను పంచుకోవచ్చు. కంటెంట్ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.
కళ్లుచెదిరే వ్యాపారం..: వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య 200 కోట్ల పైచిలుకే. 85.4 కోట్ల యూజర్లతో భారత్ ప్రపంచంలో తొలి స్థానంతో దూసుకుపోతోంది. తరవాతి స్థానాల్లో బ్రెజిల్ (14.8 కోట్లు), ఇండోనేషియా (11.2 కోట్లు), యూఎస్ (9.8 కోట్లు), ఫిలిప్పీన్స్ (8.8 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వాట్సాప్ ’అప్డేట్స్’ ట్యాబ్ను రోజుకు 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కళ్లు చెదిరే వ్యాపారం చేస్తోంది మెటా. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ చేరుతోంది.
అంచనాలకు అందనంత....: ఈ టెక్ దిగ్గజాల ప్రకటనల ఆదాయం అంచనాలకు అందనంత ఉంది. గూగుల్ 2024లో రూ.22,75,560 కోట్ల ఆదాయం పొందింది. 2025 జనవరి–మార్చిలో మెటా ప్రకటనల ఆదాయం రూ.3,55,180 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.14 శాతం అధికం. ప్రతిరోజు మెటా యాప్స్ను ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల మంది వాడుతున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య 6 శాతం పెరిగింది. ఇక భారత్లో ఈ రెండు దిగ్గజాలు 2023–24లో ప్రకటనల రూపంలో సుమారు రూ.50,000 కోట్లు అందుకున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.
ఈ రంగాల్లో ప్రయోజనం..: డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ), ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్), ఆరోగ్య సంరక్షణ, క్విక్ కామర్స్ వంటి రంగాలలోని బ్రాండ్స్ వాట్సాప్ స్టేటస్ ప్రకటనల నుండి ప్రయోజనం పొందుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్సాప్ స్టేటస్లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు.
సమ్మతితో ప్రకటనలు
ప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది. వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ స్థలం. ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాట్సాప్ పట్ల యూజర్లలో నమ్మకం ఉంది. యూజర్లు కుటుంబంతో, సన్నిహితులతో మాట్లాడతారు. సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు. ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదు.
అన్నింటా భారతీయులే
గూగుల్లో ఏదైనా వెతుకుతున్నప్పుడో.. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లో విహరిస్తున్నప్పుడో ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. నిముషాల వ్యవధిలోనే కొత్త కొత్త యాడ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకు కారణం.. మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్ను కోట్లాది మంది వాడుతుండడమే. ఈ స్థాయిలో యూజర్లు ఉన్నారు కాబట్టే బ్రాండ్ల ప్రచారానికి ఈ యాప్స్ అడ్డాగా మారాయి. వీటికి ఉన్న యూజర్ల సంఖ్య చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాడకంలో మన భారతీయులే ముందంజలో ఉన్నారు.
గూగుల్: రోజుకు సగటున 850 కోట్ల వరకు సెర్చెస్ నమోదవుతున్నాయి. 100 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ నుంచి నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. యూఎస్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.
ఫేస్బుక్: ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైచిలుకు నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సామాజిక మాధ్యమం ఇదే. ప్రపంచ జనాభాలో దాదాపు 37 శాతం మంది ఫేస్బుక్ వాడుతున్నారు. రోజు ఎఫ్బీ తెరుస్తున్నవారు 211 కోట్ల మంది. యూజర్లలో ఎక్కువ మంది 25–34 ఏళ్ల వయస్కులు. ఇక పురుషుల సంఖ్య 56.7 శాతం, స్త్రీలు 43.3 శాతం. 37 కోట్ల యూజర్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. యూఎస్ 19.3 కోట్లు, ఇండోనేషియా 11.7 కోట్లు, బ్రెజిల్ 11 కోట్లు, మెక్సికో 9 కోట్లు, ఫిలిప్పీన్స్ 8.7 కోట్లు, వియత్నాం 7.4 కోట్లు, బంగ్లాదేశ్ 5.5 కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాయి.
యూట్యూబ్: యాక్టివ్ యూజర్లు నెలకు 253 కోట్లకు పైమాటే. 46.7 కోట్ల మంది యూజర్లతో మన దేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. యూఎస్లో 23.8 కోట్లు, బ్రెజిల్లో 14.4 కోట్ల మంది వాడుతున్నారు. 80 భాషల్లో 100కుపైగా దేశాల్లో అందుబాటులో ఉంది. వినియోగదార్లలో పురుషులు 54 శాతం, స్త్రీలు 46 శాతం ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్: 200 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 41.4 కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ 17 కోట్లు, బ్రెజిల్ 14 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. యూజర్లలో అత్యధికులు 25–34 ఏళ్ల వయసు వారే.