
వేగంగా అందిపుచ్చుకుంటున్న వైనం
వారంలో 6 గంటలు మొబైల్ గేమ్స్ ఆడుతున్న 74% మంది
మూడింట ఒకరు జెన్–ఏఐ వాడుతున్నారు
ప్రపంచ జనాభాలో 30%, భారత్లో 27% వీళ్లే
సైబర్ మీడియా రీసెర్చ్ నివేదికలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ జెనరేషన్–జడ్ తరం ముందుంటోంది. 1997–2012 మధ్య జన్మించిన వాళ్లున్న ఈ తరం ప్రపంచ జనాభాలో దాదాపు 30% ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%. మార్కెట్లోకి అడుగుపెట్టిన నూతన సాంకేతికతను 40% జెన్–జడ్ వాళ్లు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్ ఏఐని వినియోగించేందుకూ ఆసక్తి చూపుతున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
ప్రయోగాల్లో ముందు..
మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ రావడమే ఆలస్యం.. జెన్–జడ్లోని ప్రతి 10 మందిలో నలుగురు దాన్ని వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. వైరల్ ట్రెండ్స్ విషయంలో ప్రయోగాలు చేయడంలో జెన్–జడ్ తరం ముందుంటోంది. జిబ్లీ ఫిల్టర్ను కోట్లాది మంది వినియోగించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని సీఎంఆర్ నివేదిక తెలిపింది. ‘సాంకేతికతను, ట్రెండ్ను వేగంగా అందిపుచ్చుకునే విధానం.. వినియోగ వ్యవస్థ రూపురేఖలను మారుస్తోంది. జెన్ జడ్లో సగం మంది వినియోగదారులకు ఏఐ గురించి తెలుసు. ముగ్గురిలో ఒకరు దైనందిన జీవితంలో జనరేటివ్–ఏఐని భాగంగా చేసుకున్నారు.
చరిత్రలో ఒక గొప్ప మలుపు వద్ద జెన్–జడ్ తరం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం అయిన మొదటి తరం ఇదే’ అని ఆ నివేదిక వివరించింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, ఇండోర్, గ్వాలియర్కు చెందిన జెన్–జడ్, మిలీనియల్స్ (28–44 ఏళ్ల మధ్య వయసు), జెన్ ఆల్ఫా (13 ఏళ్ల లోపు వారు) తరం ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.
పనితనం ఉండాల్సిందే..
జెన్–జడ్ తరానికి స్మార్ట్ఫోన్స్ కేవలం పరికరాలు మాత్రమే కాదు.. అవి గుర్తింపు వ్యక్తీకరణలు, అన్వేషణకు సాధనాలని నివేదిక వెల్లడించింది. పనితనం, బ్రాండ్ పట్ల నమ్మకం.. స్మార్ట్ఫోన్ల కొనుగోలును నిర్ణయిస్తున్నాయి. గేమింగ్, కంటెంట్ క్రియేషన్.. ఇన్ఫోటైన్మెంట్గా వారు భావించే ఈ వేదికలన్నీ కచ్చితమైన, అధిక పనితీరు కనబరచాల్సిందేనని ఈ తరం కోరుకుంటోంది. శక్తిమంతమైన చిప్సెట్స్ ఉండే స్మార్ట్ఫోన్లను జెన్ జెడ్ వాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాదు, మంచి బ్రాండ్లవీ, అద్భుతంగా పనిచేసేవీ వాళ్ల ప్రధాన ప్రాధామ్యాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, ఆటంకాలు లేని అనుభూతిని చిప్సెట్స్ అందిస్తున్నాయి. చిప్సెట్స్ పరంగా వినియోగదారుల సంతృప్తిలో మీడియాటెక్, ప్రీమియం బ్రాండ్ ఇమేజ్లో క్వాల్కామ్ ముందంజలో ఉన్నాయి.
ఆరు గంటలు గేమింగ్కు..
భారత్లో 74% మంది జెన్–జడ్ తరం స్మార్ట్ఫోన్లో గేమ్స్ కోసం వారంలో 6 గంటల సమయం వెచ్చిస్తున్నారు. తమ స్నేహితుల ద్వారా కొత్త గేమ్స్ గురించి తెలుసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. గేమ్స్ ఆడటం అంటే ఏదో మామూలు గేమ్స్ కాదు... ప్రీమియం గేమ్స్ ఆడాలని అనుకుంటున్న వారు 30% మంది ఉండటం విశేషం. ఖర్చు కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము ఒక్కరమే ఆడటం కాకుండా.. పోటీ ఉండాలని కోరుకుని, ఆన్లైన్ పోటీల్లో (ఈ–స్పోర్ట్స్)లో కూడా పాల్గొంటున్నారు.
కొత్త గేమ్స్ గురించి ఎలా తెలుసుకుంటున్నారంటే... (శాతం)
⇒ స్నేహితుల ద్వారా 66%
⇒ సోషల్ మీడియా ద్వారా 55%
⇒ యాప్ స్టోర్స్ ద్వారా 51%
⇒ఏ గేమ్స్.. ఎందుకు ఆడుతున్నారు?
⇒ వినోదం కోసమే స్మార్ట్ఫోన్లలో గేమ్స్ 72%
⇒ మానసిక చురుకుదనం కోసం 52%
⇒ ఈృస్పోర్ట్స్ ఆడేవారు 57%
⇒ ప్రీమియం గేమ్స్ 30%
స్మార్ట్ కార్లు
డ్రైవింగ్ అనుభవాన్ని మరింత గొప్పగా చేయాలంటే కార్లను సాంకేతికతతో అనుసంధానించాల్సిందేనని 72 శాతం అభిప్రాయపడ్డారు. స్మార్ట్ కార్లు, రియల్ టైమ్ నేవిగేషన్, విద్యుత్ లేదా పర్యావరణ ప్రియ వాహనాలు.. ఇలాంటివి కావాలని వారు కోరుకుంటున్నారు. కింది అంశాలు ఉండే స్మార్ట్ కార్స్ కావాలంటున్నారు..
అంశం శాతం
ఆధునిక భద్రతా ఫీచర్లు 59%
మెరుగైన ఇంధన వినియోగం 56%
అధిక బ్యాటరీ లైఫ్ 52%
(ఫాస్ట్ ఛార్జింగ్ కోసం)