చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ యాదగిరి
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మున్సిపల్ నిబంధనలు పాటించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ విధమైన నిర్మాణం చేపట్టినా.. తెలంగాణ బిల్డింగ్ అండ్ లేఔట్ అప్రూవ్డ్ సిస్టమ్ ద్వారా ముందస్తు అనుమతి పొందిన తరువాతే పనులు ప్రారంభించాలన్నారు. అనుమతి పత్రంలో పేర్కొన్న ప్లాన్, కొలతల ప్రకరామే నిర్మాణాలు ఉండాలన్నారు. అనుమతి పొందిన దానికి విరుద్ధంగా నిర్మిస్తే సహించేది లేదన్నారు. అట్టి నిర్మాణాలను నోటీసులు లేకుండా కూల్చివేసేందుకు సిపార్సు చేయబడుతుందని గమనించాలన్నారు. టౌన్ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు భారీ జరిమానాలు విధిస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలకు నీటి కనెక్షన్లు ఉంటే తొలగిస్తామన్నారు. ప్లాట్లు, లేదా ఇళ్లు కొనుగోలు సమయంలో ఆయా నిర్మాణాలకు, మున్సిపల్ అనుమతులు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని కోరా రు. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను కోనుగోలు చేసి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు.


