ఇరిగేషన్ డీఈ జలంధర్
శంకర్పల్లి: నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ జలంధర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని మోకిల, కొండకల్ గ్రామాల్లో పర్యటించి, ఫిరంగి, పెద్ద నాలాలని పరిశీలించారు. పలుచోట్ల అక్రమణకు గురైన నాలాని గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. సహజసిద్ధంగా ప్రవహించే నీటిని అడ్డుకోవడం నేరమన్నారు. దీనిపై త్వరలోనే రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా సర్వే చేపట్టి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పరిశీలనలో మోకిల సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్, వార్డు సభ్యులు అజాం, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ సాంస్కృతికశాఖ జిల్లా కోకన్వీనర్ నరేందర్రెడ్డి
కేశంపేట: ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ సాంస్కృతికశాఖ జిల్లా కోకన్వీనర్ కర్రెడ్ల నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిఽధిలోని సంతాపూర్లో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాభావ ప్రభావంతో పంటలు ఎండి రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటలను పరిశీలించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించి సాగుకు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. ప్రధాన మంత్రి ఫసల్భీమా యోజన(పీఎంఎఫ్బీవై) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే నష్ట పరిహారం అందించే వీలుండేదని అన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్భీమా యోజన అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
శంకర్పల్లి: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను శుక్రవారం చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ రాధిక తనిఖీ చేశారు. రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రుల్లోని రికార్డులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, పరిశుభ్రత వంటి విషయాలను పరిశీలించి మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో శంకర్పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ రేవతిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 129 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వరి కొనుగోలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు సేకరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, జిల్లా మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


