షాద్నగర్ రూరల్: విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సత్ఫలితాలను సాధిస్తారని డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలోని శ్రీనివాసకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు డీపీటీ, టీడీ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలన్నారు. విద్యార్థులు డీపీటీ, టీడీ టీకాలను తీసుకోవాలని, టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం, స్వల్పంగా జ్వరం వస్తుందని, ఆందోళన అక్కర్లేదని తెలిపారు. అనంతరం విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రజిత, ఉపాధ్యాయులు లక్ష్మీదేవమ్మ, వనజ, ధనలక్ష్మి, మాధవాచారి, ఏఎన్ఎంలు రమాదేవి, కవిత, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


