ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యాదయ్య మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు 7వేలు మాత్రమే భర్తీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీని అమలు చేయడంలోనూ, జాబ్ క్యాలెండర్ ప్రటించడంలోనూ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, బి.సామేలు, రాంచందర్, చంద్రమోహన్, కందుకూరి జగన్, జిల్లా నాయకులు అంజయ్య, రాజు, సీహెచ్ జంగయ్య, నర్సిరెడ్డి, కిషన్, జగన్ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


