తుర్కయంజాల్: రోడ్ల శుభ్రత కోసం తుర్కయంజాల్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన స్వీపింగ్ మెషిన్ కొనుగోలు వ్యవహారంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్ డిమాండ్ చేశారు. రాగన్నగూడలోని ఆదిభట్ల సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు హాజరైన వారు మాట్లాడారు. రూ.71 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన మెషిన్ ఒక్కరోజు కూడా పనిచేయలేదని అన్నారు. ఒకరోజు తీసుకొచ్చి పూజలు చేసిన అనంతరం ఇక్కడి నుంచి తరలించారని ఆరోపించారు. పత్రికల్లో వార్తలు వచ్చిన సమయంలో మొక్కుబడిగా ఒకరోజు తీసుకువచ్చారని, రోడ్డు ఎక్కగానే అది పాడైపోయిందని గుర్తుచేశారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన మెషిన్ కనిపించకుండా పోవడం సిగ్గుచేటని, అసలు కొనుగోలు చేశారా లేదా, కొనుగోలు చేసి ఉంటే వెంటనే ప్రజల ముందుకు తేవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు వ్యవహారంలో జరిగిన లావాదేవీలను పూర్తిగా వెల్లడించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్, సీనియర్ నాయకులు కొత్త అశోక్ గౌడ్, బచ్చిగళ్ల రమేష్, మాజీ సర్పంచ్లు సానెం అర్జున్ గౌడ్, వడ్డేగోని పాపయ్య గౌడ్, నాయకులు కందాల బలదేవ్ రెడ్డి, యూసుఫ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గుండ దాసు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా


