మొయినాబాద్ రూరల్: తళుక్కున మెరిసే గోడలు, సర్వాంగ సుందరమైన తరగతి గదులు, నిగనిగలాడే బ్లాక్ బోర్డులు, పక్కన మహనీయుల వ్యాఖ్యలు.. ఇవన్నీ వింటుంటే ఇదేదో కార్పొరేట్ పాఠశాలలా ఉంది కదూ.. అలాంటిది కానే కాదు.. సకల హంగులతో మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో ఇవన్నీ చూడవచ్చు. స్థానిక సర్పంచ్, దాతల సహకారంతో సర్కారు బడి రూపురేఖలే మారిపోయాయి. దాదాపు రూ.5–6 లక్షలు వెచ్చించి పాఠశాలలో గోడలకు రంగులతో పాటు బ్లాక్ బోర్డులు, బొమ్మలు, కొటేషన్లు, మెరుస్తున్న పెయిటింగ్లు వేశారు. ఇవే కాకుండా ఫర్నిచర్, టాయిలెట్ల సౌకర్యం తదితర వసతులు సమకూర్చారు. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రాథమిక పాఠశాల కళకళలాడుతోంది.
దాతల సహకారంతో పాఠశాలలకు కొత్త హంగులు
పాఠశాల అభివృద్ధే లక్ష్యం
ప్రభుత్వంతో పాటు తమ వంతుగా పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించాం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ విద్యార్థులు చేరారు.
– పద్మసంజీవరెడ్డి, సర్పంచ్, నాగిరెడ్డిగూడ


