మొయినాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న ఓంశాంతి నిలయంలో ఆదివారం కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ మాత్రం గుర్తించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కడుపున పెట్టుకుని చూసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, దివ్యాంగుల విభాగం నాయకులు నర్సింహాచారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి: చెందిప్పలో వెలసిన బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం కర్ణాటక హంపీ పీఠాధిపతి శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యారణ్య భారతి స్వామి శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషే కం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ ఆకారంలో వెలసిన మరకత శివుడికి ఎంతో మహిమ ఉందన్నారు. ఈ లింగాన్ని దర్శించుకుంటే ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మి క శక్తి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లికార్జున్, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ రాష్ట్ర, జిల్లా నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం నాయకులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకుడు జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్ మాట్లాడుతూ.. కిందిస్థాయి వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను డీఎంహెచ్ఓ వేధిస్తున్నారని మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీఓ కార్యదర్శి శ్రీనివాస రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు 80 బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కాచిగూడ, మియాపూర్, మల్కాజిగిరి, హయత్నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఆలయం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ నగర్ మీదుగా బస్సులను నడపనున్నారు. మరింత సమాచారం కోసం ప్రయాణికులు 99592 26160కు ఫోన్ చేయొచ్చు.


