హుడాకాంప్లెక్స్: పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు ధ్వజమెత్తారు. సంఘం సరూర్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులకు అనుకూలంగా అనేక కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చిందని విమర్శించారు. బీడీ, చేనేత పరిశ్రమలపై జీఎస్టీ విధించి ఆ పరిశ్రమలు పనిచేయకుండా చేసి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం, ప్రైవేటు పరం చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఏఐటీయూసీ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్ మాట్లాడుతూ.. అదానీ, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేసి పరిశ్రమలను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారగోని ప్రవీణ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జీఎస్టీ లాంటి తప్పుడు విధానాల మూలంగా దేశంలో సుమారు 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, అనేకమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి, సరూర్నగర్ మండల కార్యదర్శి బాతరాజు నర్సింహ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతికుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మారగోని ప్రవీణ్గౌడ్, అధ్యక్ష, కార్యదర్శులుగా రఘుమోహన్రెడ్డి, నరేష్, కోశాధికారిగా భిక్షపతి, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్, సీహెచ్ యాదయ్యగౌడ్, సెక్రటరీగా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


