కందుకూరు: కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానా లను నిస్సిగ్గుగా అమలు చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ విమర్శించారు. మండల కేంద్రంలో ఆదివారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. పని గంటల విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. రైతు నల్ల చట్టాల పేరుతో పూర్తిగా అదానీకి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తూ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఎస్పీని అమలు చేయకుండా రైతుల అభివృద్ధి పేరుతో ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ రైతును నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. డిస్కంల పేరుతో స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ఆలోచన విరమించికోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెంచారన్నారు. మోదీ పాలనను నిరసిస్తూ ఆగస్టు 10న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగే జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేసేలా భారీగా శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.చంద్రమోహన్, రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దుబ్బాక రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, బుద్దీరపు శ్రీనివాస్, అంకగళ్ల కుమార్, ఆర్.శేఖర్, కె.భాస్కర్, పి.అంజయ్య, జె.రుద్రకుమార్, కె.సురేష్, వంగూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి


