షాద్నగర్: దేశాభివృద్ధిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ఆదివారం ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ వార్షిక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారతదేశ నాగరికత ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. తరతరాలుగా గిరిజనులు అడవులు, నదులు, పర్వతాలు, జీవ వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్థిరత్వం, వాతావరణ మార్పుల గురించి చర్చిస్తోందని అన్నారు. స్థిరమైన జీవనశైలికి అసలైన అర్థం గిరిజన సమాజ జీవన శైలిలో దాగి ఉందన్నారు. గిరిజన సంప్రదాయాలు దేశ నాగరికత, సాంస్కృతిక వారసత్వంతో ముడివేసుకొని ఉన్నాయని చెప్పారు. విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామికవేత్తలుగా, వైద్యులుగా, క్రీడాకారులుగా, కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులుగా గిరిజనులు రాణిస్తుండడం అభినందనీయమన్నారు. వారు ఎక్కడ నివసిస్తున్నా రాజ్యాంగ బద్ధమైన హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా ప్రధాని మోదీ గిరిజన సాధికారత, వారి వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిందన్నారు. హైదరాబాద్లో రూ.25కోట్లతో రాంజీ గోండ్ ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ములుగులో రూ.900కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని వివరించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి


