ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లు లేవనెత్తిన డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఇతర సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి


