మీర్పేట: డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రతి పౌరుడు పాటుపడాలని ఈగల్ ఫోర్స్ హైదరాబాద్ అవేర్నెస్ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యువ టీం ఆధ్వర్యంలో ఆదివారం 59వ డివిజన్ టీకేఆర్ బస్టాండ్ వద్ద ప్రారంభమైన 3కే యాంటీ డ్రగ్ అవేర్నెస్ మారథాన్కు మాజీ కార్పొరేటర్లు అనిల్యాదవ్, రాజ్కుమార్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, పోలీసు వ్యవస్థ కలిసి పోరాడితే తప్ప డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలలేమన్నారు. కార్యక్రమంలో టీం యువ అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు అచ్యుతానంద, యాంటీ క్రూసైడ్ సొసైటీ ఎస్ఐ పవన్కుమార్రెడ్డి, రెస్లింగ్ కోచ్ ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చినా ఎలాంటి మౌలిక వసతులు లేవని, తాము ఎలా ఉండాలని మంఖాల్ డబుల్బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వసతులు లేకపోవడంతో తాము పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నామని అన్నారు. తమకు ఇచ్చిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకోక ముందే, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకు మంఖాల్ జీహెచ్ఎంసీ డివిజన్ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ బాకి విలాస్, నాయకులు కొటకాడి శ్రీనివాస్ యాదవ్, బాదావత్ శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యలపై ప్రజలు నిలదీయాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పది రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదన్నారు. సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ద్వారా యూరియా లభించక రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని ప్రజా సమస్యలు పట్టించుకోవాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, హనుమంతు, శేఖర్, సజ్యానాయక్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కాచిగూడ: కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఆదివారం కాచిగూడ డివిజన్లో సుడిగాలి పర్యటన చేశారు. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బీజేపీ నేతలతో కలిసి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. చెప్పల్బజార్ ప్రధాన రహదారిలోని ఫుట్పాత్పై ఉన్న నర్సింహ చాయ్ డబ్బా వద్దకు వెళ్లి.. కిషన్రెడ్డితో పాటు మరో నలుగురు బీజేపీ నేతలు టీ తాగారు. చాయ్ డబ్బులు రూ.116లను డిజిటల్ విధానంలో స్కానర్ ద్వారా కిషన్రెడ్డి ఫోన్పే చేశారు. దీంతో నర్సింహ చాయ్ డబ్బా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


