ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని కొంగరకలాన్లో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కొంగరకలాన్ పట్టణ ప్రజలు, నాయకులు డిమాండ్ చేశారు. వారం రోజులుగా డంపింగ్యార్డు నుంచి దట్టమైన పొగలు రావడంతో సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకి రవీందర్ ముదిరాజ్, గోపగల్ల బాబు, దేవరపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే డంపింగ్ యార్డు ఉందన్నారు. కొంగరకలాన్లో 20వేల మంది జనాభా నివాసం ఉంటుందన్నారు. సర్వే నంబరు 300లో గతంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తుర్కయంజాల్, ఆదిబట్ల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున చెత్తను తీసుకొచ్చి పోస్తున్నారన్నారు. గత వారం రోజులుగా డంపింగ్ యార్డుకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వస్తున్నాయని, ఆ పొగతో వాయు కాలుష్యం అయి అనారోగ్యాల బారిన పడుతున్నట్లు వాపోయారు. తక్షణమే డంపింగ్యార్డును తరలించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోల నాగేష్, నాయకులు రమేష్, మహేందర్, ప్రవీణ్, సురేష్, భాస్కర్, పవన్, రాఘవేందర్, రమేష్, శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


