
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
కొందుర్గు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు కంటెయినర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్ బహదూర్పురాకు కంటెయినర్లలో ఆవులను తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం మధ్యాహ్నం రామచంద్రాపూర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఏపి29 టీఏ9171, టీఎస్07 యూజీ5594 నంబర్లు కలిగిన కంటెయినర్లలో అమానవీయంగా 90 ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి గోశాలకు తరలించారు. వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు సునీల్, హతీఫ్ఖాన్, శంకర్, మహ్మద్ ఇస్తేశంమొద్దీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. ఆవులను హైదరాబాద్ జియాగూడలోని శ్రీసమరిత్ కామధేను గోశాలకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఎంఎంఎస్ అందుకున్న ఏసీపీ మోహన్కుమార్
గోల్కొండ కోటలో ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య మండల ఏసీపీగా పని చేస్తున్న శ్రీరాముల మోహన్కుమార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎంఎస్) అందుకున్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోవ్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్కుమార్ 1995లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 1996–99 మధ్య హాబీబ్ నగర్, 2000–03 మధ్య చార్మినార్, 2003–09 మధ్య దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ల్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2009లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆపై మీర్చౌక్, దక్షిణ మండల టాస్క్ఫోర్స్, చార్మినార్, పంజాగుట్ట, తూర్పు మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేశారు. 2018లో డీఎస్పీగా పదోన్నతి పొందిన మోహన్కుమార్ దక్షిణ మండలం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా, సూర్యాపేట డీఎస్పీగా, నగర సీసీఎస్, పంజగుట్ట ఏసీపీగా పని చేశారు.
‘సహజవనరుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి’
హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: సహజవనరుల పరిరక్షణ సమాజంలో అందరి లక్ష్యం, బాధ్యత కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే మెరుగైన జీవనాన్ని కొనసాగించగలమని స్పష్టం చేశారు. హైడ్రా ఆ దిశగా పని చేయడానికి పునరంకితం కావాలని ఆకాక్షించారు. బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్న మేరకే నగరంలో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పని చేస్తోందన్నారు
మూసారాంబాగ్ వంతెన హైడ్రా క్లియరెన్స్...
హిమాయత్సాగర్ నుంచి భారీ మొత్తంలో నీటిని కిందకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. పై నుంచి వరదతో పాటు కొట్టుకువచ్చిన చెత్త, ప్టాస్టిక్ వ్యర్థాలు మూసారాంబాగ్ వంతెన వద్ద నిలిచిపోతున్నాయి. ఇవి అడ్డం పడి నదీ ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. ఫలితంగా చాదర్ఘాట్, మూసారాంబాగ్లోని శంకర్నగర్, మూసానగర్, రసూల్పుర తదితర బస్తీలను వరద ముంచెత్తుతోంది. ఈ విషయం గుర్తించి శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు ముసారంబాగ్ వంతెన వద్ద క్లియరెన్స్ చేపట్టాయి. అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు నిర్వహిస్తున్నాయి. గుర్రపు డెక్కతో పాటు గడ్డి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తోంది. రెండు జేసీబీలతో పాటు టిప్పర్లను అక్కడే ఉంచిన అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. దీంతో వరద సాఫీగా ముందుకు సాగుతోంది.
శంషాబాద్ రూరల్: అనుమతి లేకుండా హుక్కా పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గండిగూడ గ్రామంలో ఉన్న ఎంఆర్జీ ఫాంహౌస్లో గురువారం రాత్రి కొందరు హుక్కా పార్టీ జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద హుక్కా తాగే పరికరాలు, ఒక స్కూటీ, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.