వీర్నపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం మొరాయించింది. వీర్నపల్లి నుంచి వన్పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాక్సిలరేటర్ వైర్ తెగిపోవడంతో నడుస్తుండగానే నిలిచిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం వైర్ను సరిచేసి వన్పల్లి వరకు తీసుకెళ్లి ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చారు.
ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి
సిరిసిల్లటౌన్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల్కార్ శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ సర్పంచులకు గౌరవ పెన్షన్ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటునందించామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు బొడ్డు దేవయ్య, ఏరెడ్డి మల్లారెడ్డి, నాలుక సత్యం, సంపూనూరి మల్లేశంగౌడ్, గుర్రం భూపతిరెడ్డి, దేవుని సుజాతనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
సిరిసిల్లటౌన్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్లో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆగస్టు 10న సిరిసిల్లలో నిర్వహించే మహాధార్నను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేశ్, నాయకులు సిరిమల్ల సత్యం, దాసరి రూప, సందుపట్ల పోచమల్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు సగం వాటా దక్కాలి
సిరిసిల్ల టౌన్: బీసీల జనాభా ఎంతశాతం ఉంటే అంతేశాతం రిజర్వేషన్లు దక్కాల్సిందేనని బీసీ సామాజిక వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్కుమార్ డిమాండ్ చే శారు. శనివారం పట్టణ పద్మశాలీ సంఘంలో బీసీల రిజర్వేషన్లు, హక్కులపై అవగాహన కల్పించే బీసీ మ్యానిఫెస్టో పుస్తకాలను బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలైనప్పుడే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. బీసీల రిజర్వేషన్లపై ప్రధానమంత్రికి దేశవ్యా ప్తంగా కోటి ఉత్తరాల ఉద్యమం చేపడుతున్నామన్నారు. అఖిలభారత పద్మశాలీ సంఘం నేత చిందం రాధాకిషన్, శ్రీగాధ మైసయ్య, ఆంకారపు మహేశ్, గుడ్ల విష్ణు, దూస సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


