విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు కరువు ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేరు జిల్లాలో 237 ఎస్జీటీ పోస్టులు ఖాళీ
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యార్థులున్న స్కూళ్లలో టీచర్ల కొరత ఉండగా.. ఉపాధ్యాయులున్న బడుల్లో విద్యార్థుల నమోదు లేదు. టీచర్ల కొరతను అధిగమించేందుకు ఏటా విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేస్తుంటారు. విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లలోని టీచర్లను ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలకు పంపిస్తారు. కానీ ఈ విద్యాసంవత్సరం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లలో టీచర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో 639 ప్రభుత్వ పాఠశాలల్లో 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఖాళీల భర్తీ ఎప్పుడో..
జిల్లాలో 489 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 237 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రభుత్వం 2025 ఆగస్టులో పదోన్నతులు కల్పించింది. ఇందులో పదోన్నతి పొందిన 45 మంది ఉపాధ్యాయులను ఇప్పటికి బదిలీ చేయలేదు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్గా పనిచేయక, ఇటు ఎస్జీటీగా ఉండలేక సతమతమవుతున్నారు. పదోన్నతి పొందిన వారు హైస్కూళ్లకు వెళ్తే ప్రైమరీ స్కూళ్లలో ఖాళీలు మరింత పెరిగే అవకాశం ఉంది.
జీవో 25 ప్రకారం ఇలా ఉండాలి
విద్యార్థులు టీచర్లు
1–19 ఒకరు
20–60 ఇద్దరు
61–90 ముగ్గురు
91–120 నలుగురు
121–150 ఐదుగురు
ఇది ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 67 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. తరచూ జరిగే శిక్షణ, సమావేశాలకు హెచ్ఎం వెళ్తుండడంతో ఉన్న ఒక్క టీచర్ ఐదు తరగతులు మేనేజ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అసలైతే 60 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు ప్రభుత్వం ముగ్గురు టీచర్లను కేటాయించాలి. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు.


