● రాజన్న జోన్–3 డీఐజీ సన్ప్రీత్సింగ్
సిరిసిల్ల: సమర్థవంతమైన పోలీసింగ్ను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించాలని రాజన్న జోన్–3 డీఐజీ సన్ప్రీత్సింగ్ సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్ను గురువారం సందర్శించారు. డీపీవో ఆఫీస్ పరిసరాలను, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(డీసీఆర్బీ) విభాగాలను పరిశీలించారు. జిల్లా పోలీస్ అధికారుల సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో టెక్నాలజీని వినియోగిస్తూ, శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో కన్విక్షన్ రేటు మెరుగ్గా ఉండటం అభినందనీయమన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేలా ప్రోత్సహించాలని కోరారు. పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. అంతకుముందు ఎస్పీ మహేశ్ బీ గీతే పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, శాంతిభద్రతల పరిరక్షణ తదితర కార్యక్రమాలను వివరించారు. ఎస్పీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ప్లాంట్ను ప్రారంభించారు. డీఎస్పీలు శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్, మొగిలి, వీరప్రసాద్, శ్రీనివాస్, నాగేశ్వర్రావు, రవీందర్ పాల్గొన్నారు.
పోక్సో కేసుల్లో శిక్షలు పడాలి
వేములవాడఅర్బన్: పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రాజన్న జోన్ డీఐజీ సన్ప్రీత్సింగ్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పోలీస్ సబ్డివిజన్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేములవాడ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్ ఉన్నారు.


