న్యూస్రీల్
యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ తీరు 12 గ్రామాలు.. 20 వేల ఎకరాల ఆయకట్టు ప్రకటనలకే పరిమితమైన పనులు.. క్షేత్రస్థాయిలో కదలిక కరువు భూసేకరణ, పరిహారం చిక్కులు వీడితేనే మిగిలిన పనులకు మోక్షం ఆయకట్టు రైతుల ఎదురుచూపులు
మట్టి..కొల్లగొట్టి
జిల్లాలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ, జనసేన నాయకులు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నారు.
మాటల్లో అభివృద్ధి.. చేతల్లో మాత్రం అడుగు ముందుకు పడని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం అభివృద్ధి పనులపై ప్రకటనలు గుప్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొరిశపాడు మండలం తమ్మవరం వద్ద చేపట్టిన యర్రం చిన పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 12 గ్రామాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏళ్లుగా ఆటంకాల మధ్య నిలిచిపోయింది. సమస్యలు పరిష్కరించి పనులు పట్టాలెక్కించాల్సి ఉండగా.. ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఆయకట్టు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
మేదరమెట్ల: గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు (జీఆర్పీ)లో భాగంగా 2007లో రూ.177 కోట్ల అంచనా వ్యయంతో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కొరిశపాడు మండలంలోని 8, నాగులుప్పలపాడు మండలంలోని 4 గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. ఇందులో కొరిశపాడు రిజర్వాయరు కింద 9,500, బొల్లవరప్పాడు రిజర్వాయరు కింద 10,500 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఇప్పటికే సుమారు రూ.114 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం భూసేకరణ, పరిహారం, న్యాయ వివాదాలు తదితర కారణాలతో పనులు నిలిచిపోయాయి.
పరిహారం చిక్కులతో..
పథకానికి అవసరమైన భూసేకరణ పూర్తిస్థాయిలో జరగలేదు. పరిహారంపై పలువురు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్ని చోట్ల స్టేలు వచ్చాయి. మరోవైపు రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాల కల్పన కూడా పూర్తికాలేదు. కొరిశపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని తూర్పుపాలెంలో 149, పెద్దూరులో 168 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఉమ్మడి సర్వేలో గుర్తించారు. అయితే ఇప్పటి వరకు నిర్వాసితులకు పరిహారం అందలేదు. ప్రత్యామ్నాయ స్థలాల సేకరణ కూడా కొలిక్కిరాలేదు.
ఎప్పటికి అందేను పరిహారం?
ఈ ఏడాది ఏప్రిల్లో రూ.35.50 కోట్లు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. తూర్పుపాలెం, పెద్దూరులో ఇళ్లు కోల్పోయే వారికి రూ.15.50 కోట్లు త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ స్థలాల కోసం 20 ఎకరాలను పరిశీలించినట్లు తెలిపారు. బొల్లవరప్పాడు రిజర్వాయరు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు గతంలో రూ.4 కోట్లు కేటాయించగా.. తాజాగా మరో రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి. అయితే న్యాయ వివాదాలు పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుందన్నది ప్రశ్నగానే ఉంది. ఇక పరిహారం ఎప్పుడు అందుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
మిగిలిన పనులకు కొత్త అంచనాలు
ప్రారంభంలో రూ.177 కోట్లుగా ఉన్న పథకం అంచనా వ్యయం ప్రస్తుతం ఎంతకు చేరుతుందన్నది తేలాల్సి ఉంది. మిగిలిన 40 శాతం పనులకు ప్రస్తుత ధరల ప్రకారం కొత్త డీపీఆర్ రూపొందించాల్సి ఉంది. దాని ఆధారంగా నిధులు మంజూరు కావాలి. అదే సమయంలో భూసేకరణ, పరిహారం వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కావాలి. ఈ ప్రక్రియ ఏదీ పూర్తికాకముందే పథకం పనులు పూర్తయినట్లుగా ప్రచారం చేయడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఆశలు ఆవిరి చేయొద్దు
‘‘సాగునీరు వస్తే నాలుగు పంటలు పండిస్తాం. తిండి గింజలకు, పశువుల మేతకు ఇబ్బంది ఉండదు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. ఏళ్లుగా ఈ నీటి కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిగో అయిపోయింది.. అదిగో పూర్తవుతుంది అంటూ ప్రకటనలతో మా ఆశలతో ఆడుకోవద్దు. పనులు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టంగా చెప్పాలి’’ అని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
అబద్ధం చెప్పడమే చంద్రబాబు అస్త్రం


