దొనకొండ: బైకు చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎల్.రామకృష్ణ శనివారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ఈపురు మండలం ఇనుమెర్ల గ్రామానికి చెందిన వడ్డే సైదుబాబు ఏడాది నుంచి మండలంలోని ఇండ్లచెరువులో గుంటూరు వాసి సేలం రవికి చెందిన పొలంలో కూలి పని చేస్తూ దొనకొండ ఆర్ఎంపీ కొండలు ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సైదుబాబు బైకుపై రోజూ ఇండ్లచెరువు వెళ్లి పొలంలో పని ముగించుకుని దొనకొండ వస్తుంటాడు. రెండు నెలల క్రితం రాత్రి ఇంటి ముందు మోటార్ సైకిల్ను పార్కు చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు లేచి చూడగా ఇంటి ముందు ఉండాల్సిన మోటార్ సైకిల్ కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామం నివాసి పి.రమేష్, ఇట్ల వంశీ, దొనకొండ మండలం ఆరవల్లిపాడు గ్రామానికి చెందిన పి.శివయ్యలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ రామకృష్ణను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
అద్దంకి రూరల్: మహిళ మెడలో బంగారు చైనును లాక్కెళ్లిన సంఘటన శనివారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేశారు. సీఐ కథనం ప్రకారం..అద్దంకి మండలం శ్రీనివాసనగర్లో నివాసం ఉంటున్న రావి నాగమ్మ ఇంటి వద్దకు స్కూటీపై ఇద్దరు దుండగులు వచ్చి శుభలేఖలు ఇవ్వాలని ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత మంచినీరు ఇవ్వమని అడిగారు. ఆమె మంచినీరు తెచ్చి ఇస్తుండగా మెడలోని 4 సవర్ల బంగారు నాన్తాడును లాక్కొని స్కూటీపై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గిద్దలూరు రూరల్: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. స్కూల్లో చదువుతున్న ఓ బాలిక పట్ల ఉపాధ్యాయుడు ఖాజావలి తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యార్థినిని తీసుకుని శనివారం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


