● దళిత యువకుడిపై టీడీపీ అగ్రకుల వర్గీయుల దాష్టీకం
యర్రగొండపాలెం: అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన యువతికి (వివాహిత) తన బండిపై లిఫ్ట్ ఇచ్చినందుకు దళిత యువకుడిపై ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వర్గీయులు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చెందిన మాకం రాజశేఖర్ తన కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోవడంతో మందుల కోసం ఈ నెల 9న బైక్పై వినుకొండకు వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తుండగా వినుకొండ అడ్డరోడ్డులో అదే గ్రామానికి చెందిన అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన యువతి నిలబడి ఉంది. ఆమె రాజశేఖర్ను ఆపి ‘‘చాలాసేపటి నుంచి బస్సులు రాలేదన్నా.. నీ బండిపై ఎక్కించుకొని ఊరికి తీసుకొని వెళ్తావా’’ అంటూ బైక్ ఎక్కింది. అక్కడి నుంచి వస్తుండగా త్రిపురాంతకానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఐనేని పెద్ద ఆంజనేయులు, వడ్డెపల్లి రాజాకృష్ణ ఎదురుపడి బైక్ను ఆపారు. ‘‘లం.. కొడకా.. నీ కేడర్ ఎంత, మా కేడర్ ఎంత.. మా కులం అమ్మాయిని బండి ఎక్కించుకుంటావా నా.. కొ.. ’’ అంటూ దుర్భాషలాడారు. ‘నిన్ను చంపితే ఎవరు అడ్డు వస్తారో చూద్దాం.. మా వెనుక పార్టీ ఉంది.. ఒక వారం జైలులో ఉండి వస్తాం, ఎవరు ఏమి పీకుతారు’ అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. శుక్రవారం వారిద్దరూ దళిత యువకుడికి ఫోన్ చేసి నీ ఇంటి వద్దకు వస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి మళ్లీ బూతులు తిడుతూ తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మాకం రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద ఆంజనేయులు, రాజాకృష్ణ ఫోన్లో దుర్భాషలాడుతున్న సమయంలో రికార్డు చేశానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట రమణయ్య తెలిపారు. రాజశేఖర్పై దాడిని దళిత సంఘాలు ఖండించాయి.


