గిద్దలూరు రూరల్: పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో నివాసముంటున్న మాజీ సైనికుడు సూరేపల్లె చిన్నిక్రిష్ణయ్య ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. అందిన సమాచారం మేరకు.. చిన్నిక్రిష్ణయ్య తన భార్యతో కలిసి గుజరాత్లోని కుమారుడి వద్దకు వెళ్లారు. ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని దుస్తులు, సామగ్రిని చెల్లాచెదురు చేసి, అందులోని 4 తులాల వెండి, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. సోమవారం తిరిగొచ్చిన బాధితులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.సత్యానంద్ పిలుపు
ఒంగోలు వన్టౌన్: ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.సత్యానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సివిల్, రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్ రికవరీ, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ, కార్మిక, విద్యుత్ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎక్కువ కేసులు రాజీ మార్గంలో ముగిసేలా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని, ఇక్కడ వెలువడే అవార్డు అంతిమమని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు.
అద్దంకి రూరల్: బైక్ వెనుక చక్రంలో చీర చెంగు ఇరుక్కొని కిందపడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మేదరమెట్లకు చెందిన సంధ్య, మహేష్ దంపతులు ఈ నెల 5వ తేదీ రాత్రి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై అద్దంకి రామ్నగర్లోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళ్తుండగా వెంకటేశ్వర అపార్ట్మెంట్ సమీపంలో వెనుక కూర్చున్న సంధ్య చీర చెంగు చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోవడంతో తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. భర్త మహేష్ వెంటనే ఆమెను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం సంధ్య మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుడ్లూరు: పట్టపగలే గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలి చేతుల్లోని బంగారు గాజులను లాక్కెళ్లిన ఘటన మండల కేంద్రమైన గుడ్లూరులో కలకలం రేపింది. మంగళవారం స్థానిక మెయిన్ బజారులోని ఇనుప వ్యాపార దుకాణం వద్దకు మోటార్ సైకిల్పై ఇద్దరు ఆగంతకులు వచ్చారు. కిరోసిన్ కొలిచే లీటరు క్యాన్ కావాలని షాపు యజమాని సరోజనమ్మను అడిగారు. ఆమె చేతులకు ఉన్న బంగారు గాజులను చూసి, ‘ఇలాంటి డిజైన్తోనే గాజులు చేయించుకుంటాం’ అని నమ్మబలుకుతూ క్షణాల్లో వాటిని లాక్కుని పరారయ్యారు. అనంతరం అదే బజారులో మరో వ్యక్తి చేతి ఉంగరాన్ని, సినిమా హాల్ సెంటర్లో మరికొందరిని లక్ష్యంగా చేసుకుని చోరీకి యత్నించగా స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనలపై ఎస్సై వి.వెంకట్రావును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
● నాలుగో రోజూ ఎస్డీఆర్ఎఫ్
ముమ్మర గాలింపు
పెద్దదోర్నాల: ఈతకు వెళ్లి వెలిగొండ ఫీడర్ కెనాల్ ప్రవాహంలో గల్లంతైన యువకుడు రాజ్కుమార్ ఆచూకీ నాలుగో రోజైన మంగళవారం కూడా లభ్యం కాలేదు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రాజ్కుమార్, అతని సోదరుడు వినయ్కుమార్ కెనాల్ నీటిలో కొట్టుకుపోయారు. సోమవారం వినయ్కుమార్ మృతదేహం సుంకేసుల సమీపంలో లభ్యం కాగా, రాజ్కుమార్ మృతదేహం కోసం గాలింపును ముమ్మరం చేశారు. రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫీడర్ కెనాల్, నల్లమలసాగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా జల్లెడ పడుతున్నారు.


