ఒంగోలు సబర్బన్: బ్రిటీష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ సారథ్యంలో సాగిన ఉప్పు సత్యాగ్రహంలో జిల్లాకు చెందిన అనేక మంది పాల్గొన్నారు. 1920 దశకంలో అప్పటి మద్రాస్ ప్రావెన్సీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో సముద్రతీర ప్రాంత గ్రామాలైన కనపర్తి, దేవరంపాడు ప్రాంతాల్లో ఉద్యమం ఉధృతంగా జరిగింది. మహాత్మా గాంధీ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉధృతంగా ఉన్న సమయంలో కనపర్తి వద్ద బ్రిటీష్ పాలకులు పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఉప్పుపై సుంకం చెల్లించకుండా ఎవరూ తరలించటానికి లేకుండా పోలీస్ పహారా ముమ్మరంగా ఉండేది. దేవరంపాడు గ్రామంలో ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరు ప్రకాశం పంతలు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా సాగింది. ప్రకాశంతో పాటు దేశభక్త కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, సాగి విజయ రామరాజు, షేక్ గాలీబు సాహెబుతో పాటు మరికొంత మంది ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఉద్యమం కోసం దేవరంపాడు గ్రామంలోని టంగుటూరు ప్రకాశం పంతులు సొంత డాబాను, అర ఎకరం పొలాన్ని ఉద్యమానికి దానంగా ఇచ్చేశారు. ఉప్పు సత్యాగ్రహం విజయవంతం అయిన తరువాత 1935 జనవరి 1వ తేదీన బాబూ రాజేంద్ర ప్రసాద్ ఒంగోలుకు వచ్చి ఒంగోలు నుంచి గుర్రపు బగ్గీలో దేవరంపాడు చేరుకున్నారు. అదేరోజు ఉప్పు సత్యాగ్రహ విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుత ఒంగోలు రూరల్ మండలం పరిధిలోని దేవరంపాడులోని విజయ స్తంభం ప్రాంగణాన్ని ఒంగోలు రూరల్ తహశీల్దార్ కృష్ణ మోహన్, ఎంపీడీఓ రాజశేఖర్ శుక్రవారం సందర్శించారు. ఈ నెల 23న ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆ ప్రాంగణాన్ని అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


