న్యూస్రీల్
పనిభారం పెరిగినా.. గుర్తింపు కరువు...
కేజీబీవీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అవస్థలు
జీతాల కోసం రెండు నెలలుగా ఎదురుచూపులు
రూ.6.20 కోట్ల మేర బకాయిలు
అప్పులతో కుటుంబాల నిర్వహణ
పదోన్నతులు, బదిలీలపై నీలినీడలు
ఒంగోలు సిటీ:
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉద్యోగులు బదిలీలు, పదోన్నతులు, వేతనాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004లో కేజీబీవీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ (జనరల్) బదిలీలు నిర్వహించకపోవడంతో పలువురు ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా ఒకేచోటే విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. గత మే 6న సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) కార్యాలయం బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ.. ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇతర శాఖల్లో బదిలీలు పూర్తయినా కేజీబీవీ ఉద్యోగుల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
రూ.6.20 కోట్ల వేతన బకాయిలు...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 38 కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, అకౌంటెంట్లు, సైట్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు తదితర విభాగాల్లో సుమారు 1,400 మంది పనిచేస్తున్నారు. వీరిలో 850 మందికిపైగా టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. మండల విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల్లో మరో 550 మందికిపైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీల్లో సీఆర్టీ, పీజీసీఆర్టీలకు నెలకు రూ.26,555, నాన్టీచింగ్ సిబ్బందికి రూ.7 వేల నుంచి రూ.17 వేల వరకు, ఇతర ఉద్యోగులకు రూ.23 వేల వరకు వేతనం అందుతోంది. వీరికి ప్రతి నెలా సుమారు రూ.3.10 కోట్ల మేర వేతనాలు చెల్లించాల్సి ఉండగా, రెండు నెలలుగా జీతాలు విడుదల కాకపోవడంతో మొత్తం రూ.6.20 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
కుటుంబాల జీవనాధారం వేతనాలే కావడంతో రెండు నెలలుగా జీతాలు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ఖర్చులు, ఇంటి అద్దెలు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పెరిగిన ధరలతో ఉన్న జీతాలే సరిపోవడం లేదని, ఇప్పుడు అవి కూడా ఆలస్యమవుతుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెబుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వేతనాల విడుదలలో జాప్యం వల్ల కుటుంబాల నిర్వహణ కష్టతరంగా మారుతోందని, ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కడుపు కాలుతోంది..
కేజీబీవీలు, విద్యాశాఖ పరిధిలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సాధారణ విధులతో పాటు వివిధ సర్వేలు, యాప్ల నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కేజీబీవీల్లో పనిచేసే సిబ్బందితో రాత్రి విధులు కూడా చేయిస్తున్నప్పటికీ, అందుకు తగిన వేతనం, ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


