ఒంగోలు సిటీ: స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వ్యవస్థాపక రిజిస్ట్రార్, రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ బి.హరిబాబు ప్రపంచ ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఆర్.ఎస్.సీ), యునైటెడ్ కింగ్డమ్ వారి ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఎఫ్.ఆర్.ఎస్.సీ)కి ఎంపికయ్యారు. రసాయనశాస్త్ర పరిశోధన, బోధన, శాసీ్త్రయ నాయకత్వం, ఉన్నత విద్యాభివృద్ధికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ అంతర్జాతీయ గౌరవాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సభ్యత్వ బృందం అధికారికంగా అభినందనలు తెలియజేస్తూ.. ఇకపై ఆయన తన పేరుకు ఎఫ్.ఆర్.ఎస్.సీ అనే గౌరవ హోదాను ఉపయోగించవచ్చని తెలిపింది. హరిబాబుకు విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: మార్కెట్లో బియ్యం ధరలు స్థిరంగా ఉండాలని, ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూపోతే ఊరుకునేది లేదని జాయింట్ కలెక్టర్ (జేసీ) కల్పనా కుమారి రైస్ మిల్లర్లను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిల్లర్లు, అనుబంధ సంస్థల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇటీవల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆగస్టు 1 నుంచి ఒంగోలులోని లాయర్పేట, దిబ్బలరోడ్డు, కొత్తపట్నం బస్టాండ్, కందుకూరు రైతు బజార్లలో, రైస్ మిల్లుల వద్ద వినియోగదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జేసీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో పాటు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్లు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


