మార్కాపురం: జిల్లాలోని మార్కాపురం, కనిగిరి డివిజన్లకు ఇన్చార్జి డిప్యూటీ డీఈఓలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పెద్దారవీడు ఎంఈఓ–1గా పనిచేస్తున్న పీ శ్రీనివాసులును, కనిగిరి ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పీసీపల్లి ఎంఈఓ–1 జీ సంజీవిలను నియమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు లీప్యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సుబ్బారావు తెలిపారు. స్కూల్ డెవలప్మెంట్ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
ఒంగోలు టౌన్: నిరుపేద, మధ్య తరగతికి చెందిన రవాణా కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవడం తగదని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు అన్నారు. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంట వెంటనే డీజిల్, పెట్రోలు ధరలను పెంచి రవాణా కార్మికుల నడ్డి విరిచారని విమర్శించారు. నాలుగు సార్లు ధరలు పెంచడమంటే కార్మికుల మీద దాడి చేయడమేనని స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలో ఆటో కార్మికులకు స్టాండు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల చొరవతో అద్దంకి బస్టాండు సెంటర్, నెల్లూరు బస్టాండు సెంటర్లలో స్టాండు ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన ప్రాంతాల్లో కూడా స్టాండు ఏర్పాటు చేయాలని కోరారు. రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద ఽచేయనున్న ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంకా సుబ్బారావు, తంబి శ్రీనివాసులు, మహేష్ ప్రసాద్, బసవరావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎస్టీయూ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు రూపొందించిన ప్రత్యేక టెట్ మెటీరియల్ను డీఈఓ సీవీ రేణుక మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ మాట్లాడుతూ టెట్ మెటీరియల్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డీఈవో రేణుక మాట్లాడుతూ ఎస్టీయూ రూపొందించిన టెట్ మెటీరియల్ ఎంతో బాగుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ చల్లా శ్రీనివాసులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు డి.నాగయ్య, ఎస్టీయూ నాయకులు కె. రవికిరణ్ యాదవ్, ఎస్కే ఖాదర్ బాషా, జి.పూర్ణయ్య, కె.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


