● ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి
మార్కాపురం: ప్రభుత్వమే చట్టాలను అమలు చేయకపోతే ఎలా అని ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన యువతి యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పాల్గొన్న యువకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో నిర్వాసితుల పూర్తి విధి విధానాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ తిరుపతిరెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జి కొండయ్య, సీఐటీయూ మార్కాపురం పట్టణ కార్యదర్శి పందిటి రూబేను, కార్ స్టాండ్ వర్కర్స్ యూనియన్ ట్రెజరర్ బలుసు పార్టీ కాశయ్య తదితరులు ఈ దీక్షలకు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు. ఈ దీక్ష కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కో–కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య, నిర్వాసిత గ్రామాల్లోని యువతీ, యువకులు, బొల్లవరం మల్లికార్జున, మద్దూరి శశింద్ర, పవన్, అంజి, రంగ సాయిలు, మండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.


