
రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు
ఆ అబద్ధాలు, మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమంటూ దబాయింపు
ఏడాది పాలనపై గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఇంటింటికీ పంపిస్తాడట
ఎన్నికలకు ముందు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన బాండ్లన్నీ దగ్గర పెట్టుకోండి
ఆ బాండ్ల ప్రకారం ఏడాదికే మీ కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి
అప్పటికైనా సిగ్గు తెచ్చుకుని హామీలు అమలు చేస్తారేమో చూద్దాం
లేదంటే మీ పక్షాన మీతో కలిసి పోరాడేందుకు వైఎస్సార్సీపీ, నేను సిద్ధం
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్ అంటూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవన్పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబట్టారు.
‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్ కోడ్ వినియోగిస్తే చాలు డౌన్లోడ్ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా అన్ని హామీలు 2024 జూన్ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
జగన్ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?
⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్ చేస్తున్నవే కాకుండా
అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు.
⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్ గెజిట్ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా?
⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వాలి అంటే సిలిండర్కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్!
⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయలసీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు.
⇒ 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.
⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు).
కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది.
⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు).
కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో.
ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి.
ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?
ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి.
ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకునేలా వైఎస్సార్సీపీ త్వరలో రిలీజ్ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్ జగన్
ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు
⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్సహించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు.
⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్ చెప్పే పీరియడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్ విధానం, రోజుకొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది.
పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరుగైనవిగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్రమంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.
⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు.
ఎన్నికల కోడ్తో పెండింగ్ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే.
⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది.
అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.
నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు.
⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్దయ్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
బాబు బాదుడే బాదుడు
చంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు.
ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు.
ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్ కాకి! బెవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.
ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయి
ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్ ఇస్తానన్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్. వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను తీసేసి ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు.
ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తున్నారు.
ఇలా ఇంటింటా మోసం..
మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్ ఐడీ కోడ్ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్ సైట్ లింక్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు.
ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్ కాల్ ఇవ్వండి అని రాశారు.
మిస్డ్ కాల్ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్ డీటెయిల్స్.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్ పెట్టారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు.
చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్ఎంఎస్ అని చూపి డిమాండ్ చేయండి.
ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం.
సంపద సృష్టి కాదు.. ఆవిరి
సాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్
ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి
మా హయాంలో జీఎస్డీపీలో అప్పుల శాతం 4.08%
చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12%
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పు
బాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతున్నాయంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతానికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే..
చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోంది
రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్ ట్యాక్స్) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది.
2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు.
దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్ 24న పర్మిషన్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు.
ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు.