వేధించే వారిని విడిచిపెట్టం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

వేధించే వారిని విడిచిపెట్టం: వైఎస్‌ జగన్‌

May 9 2025 3:42 AM | Updated on May 9 2025 8:09 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt

వారి పేర్లు రాసిపెట్టుకోండి.. తప్పకుండా సినిమా చూపిస్తాం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ 

అక్రమ కేసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వేధింపులు 

మీ బాధలను చూస్తున్నా.. అందుకే భరోసా ఇస్తున్నా  

మళ్లీ వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే 

ఇదే స్ఫూర్తితో ఈ మూడేళ్లూ పని చేయాలి 

జగన్‌ 2.0లో కార్యకర్తలకు అన్ని విధాలా న్యాయం చేస్తాం 

ప్రభుత్వ బెదిరింపులకు లొంగని ‘స్థానిక’ నేతలకు అభినందనలు   

పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్‌ దిశా నిర్దేశం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచి పెట్టేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్‌ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

పార్టీకి చెందిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులతోపాటు ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్‌ జగన్‌ వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..   

చంద్రబాబు అనైతిక చర్యలు  
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీపీ చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని ఇక్కడి నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతోపాటు మన పార్టీ ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. 
 
⇒ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి మున్సిపాలిటీలో 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. 

⇒ అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు మనవాళ్లే. కేవలం నలుగురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలి. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో అత్యంత విలు­వ­లతో పని చేస్తున్నారు. 

 
మనం మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు  
⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు... ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాం. 



⇒ నాడు కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిచారు. అయినా వారిని లాక్కుని, ఆ చైర్మన్‌ పదవి పొందాలని చూడ­లేదు. అందుకే చివరకు అప్పుడు నేను మన తాడిపత్రి ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్టు చేయించాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్‌ పదవిని టీడీపీ గెలిచింది. మనం ఆనాడు అలా అంత విలువలతో కూడిన రాజకీయం చేస్తే.. ఇప్పుడు అదే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఊళ్లోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆయన, ఆయన అనుచరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 

⇒ ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నా. కేవలం వైఎస్సార్‌సీపీని ప్రేమించినందుకు, నన్ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నా. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. వారికి అడుగడుగునా తోడుగా, అండగా నిలబడతాను.  

ప్రశ్నించకూడదనే నిరంకుశత్వం, డైవర్షన్‌  
⇒ ఈ రోజు సాక్ష్యాలతో సంబంధం లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. ఏ హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు.  

⇒ ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకో రోజు సినీ నటి కేసు. ఇలా ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం జరుగుతుంది? నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, తమ రూ.36 వేలు ఏమయ్యాయని యువత అడుగుతారు. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.  

వ్యవస్థలన్నీ నాశనం.. నిర్వీర్యం  
⇒ ఈ రోజు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ప్రధానమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిరీ్వర్యం చేస్తున్నారు. స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్‌ మీడియం లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా అమలు కావడం లేదు. మన ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందిన గవర్నమెంట్‌ బడులు రివర్స్‌లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తూ పక్కాగా విద్యా దీవెన ఇచ్చాం. అలాగే వసతి దీవెన కూడా పక్కాగా అమలు చేశాం. అందుకు విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు.. అలా ఏటా రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. వాటిని మనం ఇచ్చాం.  

⇒ ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3,900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వసతి దీవెన లేనే లేదు.  
⇒ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. దాన్ని మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. కానీ, కూటమి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా అస్సలు ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. 

⇒ రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈ రోజు దళారుల పాలయ్యాడు. టమాటా కిలోకు రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. అదే మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, రైతులకు నష్టం జరిగినా, వెంటనే అక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. ఆ సీజన్‌ ముగిసేలోగానే వారిని ఆదుకునే వాళ్లం. పరిహారం ఇచ్చే వాళ్లం. మనం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇచ్చాం. దాన్ని రూ.26 వేలకు పెంచి ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.  

యథేచ్ఛగా అవినీతి 
⇒ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం, అది కూడా 30 ఏళ్లు ఇచ్చేలా ‘సెకీ’ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49 చొప్పున మనం ఒప్పందం చేసుకుంటే, అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే యూనిట్‌ విద్యుత్‌కు రూ.4.60తో ఒప్పందం చేసుకుంది. 
⇒ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని, ఇంకా లూలూ కంపెనీకి రూ.1,500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. 

⇒ ఊరూరా బెల్టుషాప్‌లు. మద్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్‌ పెడితే, ఈ ప్రభు­త్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.  

బాండ్ల పేరుతో కొత్త అవినీతి  
ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి మొదలుపెట్టారు. ఏపీఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా తాము కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇంత దారుణమైన అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.  

మళ్లీ వచ్చేది మనమే.. సినిమా చూపిస్తాం  
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు.  

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఎవ్వరినీ వదిలిపెట్టబోం. ఈ రోజు వారు (చంద్రబాబు, పోలీసులు) దుర్మార్గంగా వ్యవహరి­స్తున్నారు. ఈ రోజు వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆ రోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సము­ద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. పట్టుకుని తీసుకొచ్చి సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement