అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Criticizes Lack of Opposition Voice in Assembly, Calls for Strong Representation | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్‌ జగన్‌

Sep 18 2025 4:03 PM | Updated on Sep 18 2025 8:39 PM

YSRCP Legislative Party Meeting Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని తెలిపారు. అసలు రాష్ట్రంలోప్రభుత్వం ఉందా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు.

శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్‌ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:
రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల ముందు.. 2024 జనవరి–మార్చి మొదలు ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4900 కోట్లు బకాయి. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపు లా రూ.4 వేల కోట్లు బకాయి. వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు. ఈ ఏడాది మరో దఫా పెండింగ్‌. అలా మొత్తం రూ.4200 కోట్లు బకాయి.

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్‌ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పని చేయకపోవడం కూడా ఆగిపోయింది. ఇంకా పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు. ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో పథకంలో వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంకా ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్ల బకాయి పడ్డారు.

ఇవీ మెడికల్‌ కాలేజీల ప్రయోజనాలు:
మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్‌ కాలేజీ అనేది కేవలం కాలేజీ మాత్రమే కాదు. దాంతో టీచింగ్‌ హాస్పిటల్‌ ఉంటుంది. మంచి వైద్య సేవలందుతాయి. అది ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు నడపకపోతే.. ఆయా రంగాల్లో ప్రై వేటు దోపిడిని అరికట్టగలుగుతారా? అందుకే ఎక్కడైనా, వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహిస్తుంది.

మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. ఒక మెడికల్‌ కాలేజీ ఉంటే, సీనియర్‌ వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు. వైద్య సేవలందిస్తారు. అలా ప్రజలకు మంచి వైద్యం అందడమే కాకుండా, మన పిల్లలకు.. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

వ్యవసాయ రంగం పరిస్థితి దారుణం:
రైతులకు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్‌ మార్కెట్‌ను నడిపిస్తున్నారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఏ పంటకు ఎంత ధర ఇవ్వాలన్న దానిపై నాడు మనం ప్రతి గ్రామంలోనూ పోస్టర్‌ ఇచ్చే వాళ్లం. సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు తోడుగా నిలబడే వాళ్లం. మార్కెట్‌ జోక్యంతో మంచి ధరలకు పంటలు కొన్నాం. అందుకు రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి రైతులు భయపడుతున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తిగా తిరోగమనమే.

ఎక్కడికక్కడ దోపిడి. నీకింత.. నాకింత:
శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్‌ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అక్రమంగా పర్మిట్‌ రూమ్‌లు నడుపుతున్నారు. ఉచిత ఇసుక అన్నారు. అది లేదు. ఇంకా క్వార్ట్‌›్జ, సిలికా.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్‌ కూడా అమ్మేసుకుంటున్నారు.

అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్‌హిట్‌!:
అన్నింటా దారుణంగా విఫలమైనా, ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోయినా, ఇటీవల సూపర్‌సిక్స్‌.. సూపర్‌హిట్‌ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఎన్నికల నాటి యాడ్‌తో చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌ రూ.4 వేలు లేవు. పథకాలు కూడా మారిపోయాయి. ఇదీ ఈ ప్రభుత్వ నిర్వాకం.

ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు:
అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ నుంచి వారంలోనే 5గురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే, నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆమేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పేది విన్నాం. 

కానీ, ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుతోంది. అందుకే మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దని అనుకుంటోంది. అందుకే మనల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే, ఏం మాట్లాడగలం?

ఉన్నదే ఏకైక విపక్షం.. అయినా..!:
నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకేఒక విపక్షం. అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి. ఇక్కడ మనది ఒకేఒక విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.

గట్టిగా నిలబడండి. నిలదీయండి:
కానీ, మనకు కౌన్సిల్‌లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్‌ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్‌లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని నిలదీయండి.

వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీయండి:
సూపర్‌ సిక్స్‌. సూపర్‌ సెవెన్‌ వైఫల్యం..
రీ వెరిఫికేషన్‌ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు..
పెన్షన్‌ కోతలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు..
యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు..
పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం..
రైతుల ఆత్మహత్యలు..
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ..
వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం..
ఆరోగ్య శ్రీ బంద్‌..
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ..
ప్రభుత్వంలో అవినీతి దోపిడీ..
ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్‌ లీవ్స్‌ తదితర బకాయిలు, వారిపై వేధింపులు..
పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ..
అమరావతిలో తొలివిడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌..
అసైన్డ్‌ అన్న పదయం తీసేయడం. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు..
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం..
15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు..

రాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండి:
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?. వీళ్లే బెల్టు షాప్‌లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లోకి వేసుకుంటున్నారు. లాటరైట్, క్వార్ట్‌›్జ తవ్వుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్‌ అమ్ముతున్నారు. ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడం లేదు. మండలిలో మనకు మంచి బలం ఉంది. కాబట్టి మండలి సభ్యులు పోరాట పటిమ చూపాలి. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలి.

అధికార పక్షం.. డబుల్‌ యాక్షన్‌:
అసెంబ్లీలో అధికారపక్షం డబుల్‌ యాక్షన్‌ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇంకా.. ‘ప్రజల్ని ఏడిపించేది ప్రభుత్వమే. వారిని ఏడిపించి, మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫను తామే ఏడుస్తామంటూ ప్రభుత్వం డబుల్‌ రోల్‌ ప్లే చేస్తానంటోంది. అలా రెండు వైపులా యాక్షన్‌ చేస్తోంది’. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించిన మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మేము ప్రజా సమస్యలు లేవనెత్తితేనే, అందులో నిజాయితీ ఉంటుంది.

నాడు చంద్రబాబు డ్రామాలు:
నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్‌ సెషన్‌లో గవర్నర్‌ అడ్రస్‌ సమయంలో అటెండ్‌ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్‌ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం

మెడికల్‌ కాలేజీలు కాపాడుకోవాలి:
మెడికల్‌ కాలేజీలు అన్నవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా రూ.57 లక్షలకు పెంచేస్తున్నాడు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రజలకు అత్యంత నష్టం కలిగిస్తున్న ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నిరకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తే సహించేది లేదు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement