
గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు
చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్సార్సీపీ నేతల బృందం ఫిర్యాదు
స్వాతంత్య్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
రాష్ట్రంలో ఏడాదిగా అక్రమ కేసులు.. చట్ట విరుద్ధ పాలన
ఎన్నికల హామీలపై జనం నిలదీస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు..
మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.. జడ్ ప్లస్లో ఉన్న ఆయన పర్యటనలకు భద్రత కల్పించకుండా టీడీపీ సర్కారు కుట్రపూరిత వైఖరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాదికిపైగా టీడీపీ కూటమి సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వైఎస్సార్సీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. గురువారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలసిన వైఎస్సార్ సీపీ బృందం ఈ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది.
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిందని.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచి్చంది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నివేదించింది.
ఈమేరకు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
విజయవాడలోని గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి,మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ,చిత్రంలో వైఎస్సార్సీపీ నాయకులు
ఇది నిరంకుశ ప్రభుత్వం: బొత్స
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు బొత్స వెల్లడించారు. ‘ఇవి అప్రజాస్వామికం.. గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించాం.
ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్కు చెందిన కాన్వాయ్ వాహనాలు కారణం కాదు.. వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ పల్నాడు జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హఠాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన వైఎస్ జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందంటూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలకు పాల్పడుతోందో దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది. ఏదో ఒక విధంగా వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది.
అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం అవివేకం. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వం వద్ద లేవా? దానికి తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు? పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురు దాడి చేస్తున్నారు.
సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే ఇంతకంటే ఎదురు దాడి ఉంటుందా అనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత కల్పిస్తే అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైఎస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు, అందులోని పోలీసులు, రోప్ పారీ్టలు ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం’ అని బొత్స పేర్కొన్నారు.
ప్రజలే మీ నార తీస్తారు..!
ఈ సందర్భంగా ఓ విలేకరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని బొత్సను కోరగా ఘాటుగా బదులిచ్చారు. ‘పవన్ కళ్యాణ్ ఎవడి నార తీస్తారు..? ఎవరి మక్కెలు ఇరగదీస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పనికిమాలిన మాటలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. ఒక ఎమ్మెల్యేగా జగన్కు భద్రత ఇచ్చామని హోంమంత్రి అనిత చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. తెలివి తక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు.. ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి.
జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? గతంలో చంద్రబాబు తన పర్యటనల సమయంలో భద్రత కావాలని ఎందుకు అడిగారు?’ అని బొత్స ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్..
‘ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. ప్రజలకు ఇచి్చన వాగ్దానాలను అమలు చేయలేక దృష్టి మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోంది. ప్రజల తరఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. స్వాతంత్య్రం వచి్చన తరువాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని బొత్స ధ్వజమెత్తారు.