
- నీరు–చెట్టు, ఫాం పాండ్స్ పేరుతో వేల కోట్ల అవినీతి
- చేయని పనులకు బిల్లులు డ్రా చేస్తున్న టీడీపీ నాయకులు
- ఉపాధి హామీ పనుల్లోనూ దొంగ మస్టర్లు. సంతకాలు
- యథేచ్ఛగా నిధుల దోపిడి. కేంద్ర నిధులూ మళ్లింపు
- సర్పంచ్ల చెక్ పవర్ రద్దు. కూటమి ప్రభుత్వ అనైతికం
- :ప్రెస్మీట్లో వెన్నపూస రవీంద్రారెడ్డి స్పష్టీకరణ
తాడేపల్లి: టీడీపీ కూటమి పాలనలో స్థానిక సంస్థలు, ముఖ్యంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఏ నిధులూ లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్థితిలో అవి లేవని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు నీరు–చెట్టు, ఫాం పాండ్స్ నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని, చేయని పనులకు టీడీపీ నాయకులు బిల్లులు డ్రా చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడిన వెన్నపూస రవీంద్రారెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో వెన్నపూస రవీంద్రారెడ్డి ఏం మాట్లాడారంటే..:
అంతులేని అవినీతి
అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన కూటమి పెద్దలు, ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుతో పనులు చేయకుండా, వాటిని ఎంబుక్ (మెజర్మెంట్ బుక్)లో నమోదు చేయకుండానే బిల్లులు పొందాలని చూశారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆ పనులపై విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ నీరు–చెట్టు పేరుతో ప్రజా ధనం దోపిడీకి వ్యూహ రచన చేస్తున్నారు. అగ్రిమెంట్లు జరగకుండా, ఎంబుక్లో నమోదు కాకుండానే చేయని పనులకు వేల కోట్ల ప్రజా ధనాన్ని టీడీపీ నాయకుల జేబుల్లోకి సీఎం చంద్రబాబు మళ్లిస్తున్నారు. అందుకే ఏడాది కాలంగా నీరు–చెట్టు పేరుతో ఎంత డ్రా చేశారో ప్రజలకు వివరించాలి.
నానా హడావిడి. ఇచ్చింది శూన్యం
పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావుడి చేసి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.400 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు విడుదల చేస్తే గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యవర్గాలకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారి మళ్లించారు. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాన్ సమాధానం చెప్పాలి. ప్రజలు కట్టే పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ దారి మళ్లిస్తుంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎలా పాలన సాగిస్తారు?. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, శానిటేషన్, విద్యుత్, ఇతర మరమ్మతులు చేయడానికి చిల్లిగవ్వ లేకుండా మొత్తం దారి మళ్లించి ఊడ్చేశారు.
దొంగ మస్టర్లతో ఉపాధి నిధులు డ్రా
వేలాది కుటుంబాలు వలస వెళ్లకుండా స్ధానికంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘మనరేగా’ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా«ధి హామీ పథకం–ఎన్ఆర్ఈజీఎస్) తీసుకొస్తే ఆ నిధులను కూడా టీడీపీ నాయకులు డైవర్ట్ చేస్తున్నారు. తమ సొంత లేఅవుట్లకు రోడ్లు వేసుకోవడానికి ఆ నిధులు వినియోగిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేట్ పోస్టులను కూడా రూ.5 లక్షలకు అమ్ముకునే దుస్థితికి వ్యవస్థను దిగజార్చారు. మూడు మస్టర్లలో ఒకే ఫొటోతో 30 మందికి సంబంధించిన ఉపాధి హామీ నిధులను కాజేశారు.(అంటూ ప్రెస్మీట్లో ఫోటోలు ప్రదర్శించారు)
అలా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సిన రూ.305 కూలీని ఇష్టారాజ్యంగా తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు ఉపాధి కల్పించకుండా దొంగ జాబ్ కార్డులు సృష్టించి దొంగ సంతకాలతో నిధులు ఇష్టారీతిన దారి మళ్లిస్తున్నారు. కొన్నింట్లో ఫొటోలు కూడా అప్లోడ్ చేయకుండానే నిధులు డ్రా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోంది.
దోపిడీ కోసమే ఫాం పాండ్స్ నిర్మాణం
1.55 లక్షల ఫాం పాండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో మరో అవినీతికి తెర తీశారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలానికి చెందిన ఒక ఒంటరి మహిళ పేరుతో ఆమెకు సంబంధం లేకుండానే ఫాం పాండ్ కేటాయించడమే కాకుండా ఫాంపాండ్ తవ్వినట్టు చూపించి నిధులు కూడా డ్రా చేసినట్టు వివరాలు వెబ్సైట్లో నమోదై ఉన్నాయి. ఈ విషయం తెలిసిన సదరు మహిళ ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అవినీతి చేయడం కోసమే ఈ ఫాం పాండ్ నిర్మాణం అనే కాన్సెప్టుకి తెరదీశారని స్పష్టంగా తెలుస్తోంది.
మరోవైపు ఎక్కడికక్కడ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏడాది కాలంగా ఎంపీటీసీలకు ఒక్కరికి కూడా రూపాయి గౌరవ వేతనం ఇచ్చిన పాపాన పోలేదు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారు. దీనికి ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
సర్పంచ్ తల్లులకు తల్లికి వందనం కట్
సర్పంచ్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి రాష్ట్రంలో సర్పంచ్లుగా ఉన్న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేయలేదు. ప్రజలతో ఎన్నుకోబడి ఐదేళ్లు ఉండే సర్పంచ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ నిర్ణయంపై పునఃపరిశీలన చేసి సర్పంచ్ కుటుంబాల్లో తల్లుల ఖాతాల్ల తల్లికి వందనం డబ్బులు జమ చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ కుటుంబాలను ఆదుకోవాలి. అసలు తల్లికి వందనం పథకం అమలు జరిగిందంటే వైయస్ జగన్ పోరాట ఫలితమే.
అగమ్య గోచరంగా పంచాయతీ సెక్రటరీలు
పాత, కొత్త పంచాయతీ సెక్రటరీలను ఏకం చేయాలన్న లక్ష్యంతో జీవో ఎంస్ నెం:11 తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఒక విఫల ప్రయోగం చేసింది. దీని కారణంగా దాదాపు 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వారి పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేసింది. దాదాపు వారికి 9 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు.
23న పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ విస్తృత సమావేశం
ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ సమావేశం ఈరోజు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించాం. ఉపాధి హామీ పనులు, డైవర్ట్ చేసిన నిధులు, పంచాయతీ సెక్రటరీల సమస్యలపై అందులో చర్చించాం. దీనిపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 23న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు.