సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.
‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.


