
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జగన్ లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించారని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత కూడా ఇవ్వడం లేదు. గతంలో రెండు సార్లు దాడి జరిగింది. పాదయాత్ర సమయంలోనూ అనేక అడ్డంకులు సృష్టించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకర్తలే వలయంగా మారి భద్రత కల్పించారు. 200 మంది పోలీసులను పెట్టామని ఎస్పీ చెబుతున్నారు. కానీ, హెలీకాప్టర్ వద్ద పది మంది పోలీసులు కూడా లేరు. వేల మంది హెలీకాప్టర్ వద్దకు వచ్చినా పోలీసులు నిలువరించలేకపోయారు
వైఎస్ జగన్ని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిగా కూడా జగన్ను గుర్తించడం లేదు. జగన్కు భద్రత కల్పించలేకపోతే చెప్పండి. ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించేశారు. జగన్ ఇంటి వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా చేశారు. ఆయన భద్రతపై కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ ఇస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మండలానికి ఒకరిని చంపితే కానీ భయం రాదు అనేలా భయోత్పాతం సృష్టిస్తున్నారు. చట్టానికి లోబడి పోలీసులకు సెల్యూట్ చేస్తాం. చట్టాన్ని మీరి అన్యాయాన్ని ప్రోత్సహించే వారికి కచ్చితంగా యూనిఫాం లేకుండా చేస్తాం.
తప్పుచేయకపోతే భుజాలు తడుముకోవడం దేనికి?. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారు. కొంతమంది పోలీసులకు పార్టీలు అంటగట్టి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ముగ్గురు డీజీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నలుగురు ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. డీఎస్పీలను వీఆర్లో పెట్టారు. 120మంది సీఐలకు ఇంతవరకూ పోస్టింగ్స్ ఇవ్వలేదు. ఎవరో మెప్పు పొందడానికి పోలీసు సంఘాలు మాట్లాడటం కాదు. పోస్టింగ్స్ కూడా లేకుండా వేధింపులకు గురవుతున్న పోలీసుల కోసం మాట్లాడాలని కోరుతున్నాను.

దేశంలోనే సీనియర్ లీడర్ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. అన్ని రంగాల్లో ఆదాయం తగ్గితే జీఎస్డీపీ మాత్రం ఎలా పెరిగిందో అర్ధం కావడం లేదు. 14 లక్షల కోట్లు అప్పులు చేసేశారని తప్పుడు ప్రచారం చేశారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు దొంగతో సమానం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టొద్దని పోలీసులకు స్పష్టంగా చెప్పారు. హోంమంత్రి అనిత మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. భద్రత కల్పిస్తే హెలీకాప్టర్ వద్దకు అంతమంది ఎలా వస్తారు?. జగన్ వస్తున్నాడంటే జనం తండోపతండాలుగా వస్తారు. మెసేజ్లు పెట్టి కార్యకర్తలు తరలి రావాలని పిలవాల్సిన అవసరం లేదు. హోంమంత్రి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం సరికాదు.
ఏం తప్పుచేశాడని వైఎస్ జగన్ను క్రిమినల్ అంటున్నారు. అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. మల్లెల బాబ్జీని ఎవరు చంపారో చెప్పాలి. దశరధ రామయ్యను ఎవరు హత్య చేశారో కూడా చెప్పాలి. చంద్రబాబును క్రిమినల్ అని మాట్లాడటం మాకు పెద్ద విషయం కాదు. మాకు విజ్ఞత ఉంది’ అంటూ చురకలు అంటించారు.