బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్‌ జగన్‌

Apr 9 2025 4:46 AM | Updated on Apr 9 2025 7:10 AM

YSRCP Chief YS Jagan Fires On Chandrababu Govt

శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబసభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు  

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఒక్క రామగిరిలోనే కాదు.. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు 

పోలీసులను వాచ్‌మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు  

ఏపీ ఈ రోజు బిహార్‌ కన్నా అధ్వానంగా ఉంది.. 

ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకుంటోంది 

నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పాలా?.. పోలీసులూ.. మీ టోపీలకు సెల్యూట్‌ చేయండి.. చంద్రబాబుకు కాదు  

తప్పు చేసేవారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం.. ఉద్యోగాలూ ఊడగొడతాం.. సూపర్‌ సిక్స్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారు 

ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకే హింసను ప్రేరేపిస్తున్నారు.. మా కార్యకర్త లింగమయ్యను బేస్‌బాల్‌ స్టిక్‌తో దారుణంగా కొట్టి చంపారు

చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌ చేయకుండా ఆయనకు వాచ్‌మెన్‌ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్‌ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం 
-వైఎస్‌ జగన్‌    

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు.. సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్‌ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.  

గతంలో బిహార్‌.. ఇప్పుడు ఏపీ!!  
రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు  జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్‌ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్‌ చేయించారు. 

అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్‌సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. 

ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? 
చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్‌ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు.  

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌   

రామగిరిలో రాక్షసత్వం.. 
రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్‌సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్‌ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. 



కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్‌ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్‌ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్‌ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని  ఎన్నికలు వాయిదా వేశారు. 

ఆ తరువాత ఇదే ఎస్‌ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్‌ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు.  

భయోత్పాతం సృష్టించారు.. 
ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై  వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. 

కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్‌ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్‌ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు.  

20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? 
లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్‌నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

ఎస్‌ఐ సుధాకర్‌ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్‌ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! 

నిందితులనే సాక్షులుగా చేర్చి..  
లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్‌ బ్యాట్‌ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. 

నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే..  పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు.  

మీ కుటుంబానికి అండగా ఉంటాం
⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం
⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్‌ జగన్‌   

టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. 

కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

లింగమయ్య కుటుంబాన్ని పరామ­ర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్‌ నుంచి జగన్‌ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. 

లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామ­న్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. 

టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..
జగన్‌ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకో­లేక­పోతు­న్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌  భరోసా ఇచ్చారు.  

రాష్ట్రమంతా.. రెడ్‌బుక్‌ 
దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్‌ 
‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరి­కించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.   

ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్‌ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. 

పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. 
గతేడాది ఆగస్ట్‌ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్‌ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్‌ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు.  

సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. 
గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్‌లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్‌ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు.   

ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు 
సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు.  

145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్‌.. 
మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ  నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను!!  

వంశీపై అన్యాయంగా కేసులు.. 
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.

అడుగడుగునా భద్రతా వైఫల్యం
రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి. 

వైఎస్‌ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం  

పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. 

అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. 

కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement