గ్రూప్‌–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా | YS Jaganmohan Reddy challenges CM Chandrababu, Minister Lokesh | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా

Aug 21 2026 5:08 AM | Updated on Aug 21 2026 5:08 AM

YS Jaganmohan Reddy challenges CM Chandrababu, Minister Lokesh

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌

సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని చాలెంజ్‌ 

చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలిచ్చారు 

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంక్‌ ఎలా వచ్చింది?  

మెరిట్‌ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? 

అనంతరం మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు మార్చారు?

అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలివ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు.. విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా?  

స్పోర్ట్స్‌ కోటా పేరిట టీచర్‌ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఒప్పుకున్నారు.. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి?  

మొబైల్‌ నంబర్‌ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు

అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని అబద్ధాలు చెప్పారు 

మెగా డీఎస్సీ స్కామ్‌ పక్కా సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవడానికి గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు 

గ్రూప్‌–1 నియామకాల్లో మేం ఎక్కడా తప్పు చేయలేదు  

మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్‌ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలూ లేవు 

హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్‌ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వ్యూలు.. పారదర్శకంగా ఎంపిక.. ఏ వివాదం లేకుండా ఏపీపీఎస్సీలో 78 నోటిఫికేషన్లతో 6,296 పోస్టులు భర్తీ.. అలాగే 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాలు భర్తీ

పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్‌ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు.

చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంక్‌ ఎలా వచ్చింది? మెరిట్‌ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్‌ కోటా పేరిట టీచర్‌ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్‌ నెంబర్‌ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని, బెయిల్‌పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి..    
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాది­రిగా పేపర్‌ లీకేజీ కాలేదు.. ఎవరికీ  అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖ­లాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్‌కు సూటిగా వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్‌ చేశారు. 

గ్రూప్‌–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్‌–1 నియామకాలను ఆధారాలతో వైఎస్‌ జగన్‌ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్‌ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయింద­ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్‌ వివరాలను ఫోన్‌ నంబర్‌తో సహా ప్రదర్శించిన వైఎస్‌ జగన్‌  

ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..
మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్‌లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ.  

మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టం
మా హయాంలో జరిగిన గ్రూప్‌–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్‌ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్‌–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు మొదటి ర్యాంక్‌ ఎలా వచ్చింది? మెరిట్‌ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్‌ లెటర్‌ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్‌ లీకైందని స్పష్టంగా రుజువైంది. 

బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్‌ నంబర్‌ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్స్‌ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. 

ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదు
బాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్‌ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement