పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్ | Ys Jagan Tweet On Chandrababu Negligence Over Aqua Farmers Problems | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్

Apr 10 2025 7:17 PM | Updated on Apr 10 2025 7:23 PM

Ys Jagan Tweet On Chandrababu Negligence Over Aqua Farmers Problems

సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్‌ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్‌ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్‌ సమస్యతో సంబంధం లేని యూరప్‌ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్‌ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు.  వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement