మేము గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Comments On Ap Politics And Redbook | Sakshi
Sakshi News home page

మేము గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్‌ జగన్‌

Oct 9 2024 1:26 PM | Updated on Oct 9 2024 3:52 PM

Ys Jagan Comments On Ap Politics And Redbook

సాక్షి,తాడేపల్లి : రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా? ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  అలాగే మేము గుడ్‌బుక్‌  రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామన్నారు.  వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని వైఎస్‌ జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించాం. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టంచేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. 

ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అన్నిటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించాం.



రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం 
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. బడ్జెట్‌తోపాటు సంక్షేమ క్యాలండర్‌కూడా విడుదలచేసేవాళ్లం. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల  వైఎస్సార్‌సీపీ పాలనలోనే జరిగింది

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందించాం
అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్లపాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం.రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి.అయినా ఏరోజుకూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం.

గడప గడపకు పెన్షన్‌
స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాం.మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకు వచ్చాం.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటలబీమాను అమలు చేశాం. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఆధారంగా పథకాలు ఇచ్చాం.ప్రతి ఇంటి గడపవద్దకే పెన్షన్‌, రేషన్‌లే కాకుండా పథకాలూ అందించాం

దిశయాప్‌ ద్వారా 
దిశయాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం. 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్ర కల్పించేలా చేశాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తుంది. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది

ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడంలేదు
జగన్‌ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ.. పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీ అటకెక్కింది.. బిల్లులు చెల్లించడంలేదు.ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు. కొత్త మెడికల్‌ కాలేజీలన్నీ వెనకడుగు. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడంలేదు

కష్టాలు ఎక్కువ కాలం ఉండవు
పార్టీని మరింత బలోపేతం చేయాలి. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాలనుంచే నాయకులు పుడతారు. నన్ను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు.

రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా?
రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా?. ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం. పార్టీకి మంచి చేసినవారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి.

	అందరం ఏకం అవ్వుదాం గుడ్ బుక్ రాసుకుందాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement