
మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్కతా, ఏప్రిల్ 11: బీజేపీ ఇచ్చే కొద్దిపాటి అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మనసు చంపుకొన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికిన బిహార్ సీఎం నీతీశ్ కుమార్పైనా మమత నిప్పులు చెరిగారు. వీరిద్దరూ ముస్లింలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కోల్కతాలో బుధవారం ముస్లిం పెద్దల సమావేశంలో మమతా మాట్లాడారు.
ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారులైన చంద్రబాబు, నీతీశ్ కారణంగానే వక్ఫ్ బిల్లు పార్లమెంటులో గట్టెక్కిందని అన్నారు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ నోరు మెదపకుండా కూర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీకి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ లేకున్నా ఇలాంటివన్నీ చేస్తోందన్నారు. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారని ఆరోపించారు.
నమ్మి ఓట్లు వేసినవారి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, కానీ, అదేమీ లేకుండా సాధారణ మెజారిటీతో పార్లమెంటులో ఆమోదం పొందిందని మమతా పేర్కొన్నారు.వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.