ఆస్పత్రుల నిర్వహణ, మరమ్మతులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు సాధ్యం కాదని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు
మరమ్మతులకు నిధులూ మంజూరు చేయలేం
చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం
2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.51 కోట్లు కోరిన వైద్య శాఖ
ఆరోగ్యశ్రీ ఆసుపత్రి అభివృద్ధి నిధులే సర్దుకోవాలని ప్రభుత్వం సలహా
ప్రభుత్వ ఆసుపత్రులకు ఇప్పటికే రూ.700 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు బకాయి
పేద ప్రజల వైద్య సేవా వ్యయాలపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
జగన్ ప్రభుత్వంలో కేటాయించిన ప్రత్యేక బడ్జెట్ను ఎత్తేయడంపై విమర్శలు
సాక్షి, అమరావతి: ఒక్క రోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది రూ. 130 కోట్లు.. ఈ ఏడాది రూ.10 కోట్లు.. మొత్తం రెండేళ్లలో రూ.140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. విజన్ డాక్యుమెంట్ విడుదల వంటి ఈవెంట్లకు భారీ నిధుల వెచ్చింపు. స్పెషల్ ఫ్లైట్స్లో ప్రభుత్వ పెద్దల తిరుగుళ్లు.. హంగులు.. ఆడంబరాలు.. ఆర్భాటాలు.. ప్రచారాల కోసం ఖజానా నుంచి నేరుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. అయితే పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వారి ఆరోగ్య రక్షణ విషయానికి వచ్చే సరికి మాత్రం ప్రభుత్వం దగ్గర నిధుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపునకు అప్పుల బాట పట్టిన బాబు సర్కార్ తాజాగా బోధనాస్పత్రుల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది.
2014–19లోనూ ఇంతే..
2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆస్పత్రుల నిర్వహణ కోసం రూ.34.07 కోట్లు, అత్యవసరంగా చిన్న చిన్న మరమ్మతులు చేపట్టడానికి రూ.16.92 కోట్లు చొప్పున దాదాపు రూ.51 కోట్ల బడ్జెట్ మంజూరు చేయాలని వైద్య శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తప్పించుకుంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి నిర్వహణ, మరమ్మతుల ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది.
2014–19 మధ్య ఇదే తరహాలో నిర్వహణ, మరమ్మతుల బడ్జెట్కు చంద్రబాబు కోత పెట్టారు. దీంతో ఆసుపత్రుల్లో డ్రైనేజీ లీకేజీలు, కరెంట్ వైరింగ్ సమస్యలు, వైద్య పరికరాల స్వల్ప మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ వంటి నిత్యావసర పనులకు కూడా నిధుల్లేక అప్పట్లో ఆస్పత్రులు అధ్వాన్నంగా మారిపోయాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడం మొదలు పెట్టారు. చంద్రబాబు తిరిగి గద్దెనెక్కగానే మళ్లీ బడ్జెట్ను ఎత్తేశారు.
సూపరింటెండెంట్లు గగ్గోలు
బోధనాస్పత్రుల నిర్వహణ,మరమ్మతులకు ఆరోగ్యశ్రీ నిధులు వాడుకోమని ప్రభుత్వం సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడంతో సూపరింటెండెంట్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బోధనాస్పత్రులకు దాదాపు రూ.700 కోట్ల ఆరోగ్యశ్రీ బిలు్లలు బకాయి పడినట్టు సమాచారం. బిల్లులు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల కోసం ఇంప్లాంట్స్, మందులు, సర్జికల్స్ చేసిన కొనుగోళ్ల బిల్లులే ఆస్పత్రుల వారీగా పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో మందులు, ఇంప్లాంట్స్ సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులు ఎత్తేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్వహణ, మరమ్మతులకు కూడా నిధులివ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటే రోగులకు కనీస సౌకర్యాల కల్పన ఎలా సాధ్యమవుతుందని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది.


