
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వంచనకు పాల్పడిందని.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెన్నుపోటు దినం పోస్టర్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 175 నియోజక వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ పాటిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జూన్ 4న జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము’’ అని బొత్స పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా: వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్ అని.. కూటమి సర్కార్.. మోసాలకు, అరాచకాలకు నిరసనగా జూన్ 4న రాజంపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన చేపట్టే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మోసకారి అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. హామీలంటే ఇప్పుడు భయమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయాలని తోపుదుర్తి పిలుపునిచ్చారు

కృష్ణా జిల్లా: 4న చేపట్టే ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమ పోస్టర్ను కానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. అబద్దపు హామీలతో సీఎం అయ్యారంటూ మండిపడ్డారు.
‘‘సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి?. వెన్నుపోటుకి నిర్వచనం చంద్రబాబు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచాడు. అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు. నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ నేతలకు దేశభక్తుని చక్రవర్తి పిలుపునిచ్చారు.