సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నీళ్ల సమస్యకు కేసీఆర్ కూడా ఓ కారణమేనని, ఇరిగేషన్ను నాశనం చేసిందే ఆయనని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా చిట్చాట్లో ఉత్తమ్ మాట్లాడుతూ..
తెలంగాణలో నీటి సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అయితే.. రెండోది ఎల్నినో ప్రభావం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. నీళ్ల పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. ఆయన వల్లే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి. భారీగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు.
కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేనే ఇంజనీర్ను అంటూ కాళేశ్వరం కట్టి మరీ కూల్చారు. ఇంజినీర్లు చెప్పినట్లు ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఆయన హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందలేదు. ఇదే కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన ఇలాగే చేశారు. అసలు ఎస్ఎల్బీసీని పూర్తి కాకుండా గత ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రస్తుతం మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయితే మేమేం చేయగలం?’’ అని ఉత్తమ్ చెప్పారు.
కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు కొందరు ఆయన్ను హీరోగా భావించారని, ఇప్పుడు అదే తరహా విమర్శలు ఆయనపై వస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు. తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆర్ రే కారణం. కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం జీరో. నీళ్ల కోసం పాదయాత్ర చేస్తానన్న కేసీఆర్ ప్రకటనపైనా ఉత్తమ్ స్పందిస్తూ.. ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని, ఇరిగేషన్ విషయంలో ఆయన బయటకు రాకుండా ఫామ్హౌజ్లో ఉంటేనే బెటర్ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ నీటి రాజకీయ వివాదం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఇరిగేషన్పై బీఆర్ఎస్ది బోగస్ ప్రచారమే!


