Sakshi News home page

నన్ను ఎవరూ పిలవలేదు : ప్రభాకర్‌రావు

Published Fri, Dec 8 2023 1:17 PM

Transco Cmd Absent To Cm Revanth Review On Power Department - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ  కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ  సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్‌ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

విద్యుత్‌ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి  ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్‌ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.   

నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు 

విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని  ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు.   

ఇదీచదవండి..జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు


 

Advertisement
Advertisement