
హైదరాబాద్: బీఆర్ఎస్ భూకబ్జాల ప్రభుత్వమని ధ్వజమెత్తారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి 50 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. తనకు గుంట భూమి లేదంటున్న మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్కు మియాపూర్లో 500 ఎకరాల భూమి ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు.
తనకు భూమి లేదంటున్న కవిత.. చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. తెల్లాపూర్లోని కేటీఆర్ భూకబ్జాలు త్వరలోనే బయటపెడతానని రేవంత్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని, ధరణి పోర్టల్ అనేది పెద్ద కుంభకోణమన్నారు. ధరణి కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వ భూములను కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. తాను భూకబ్జాలు చేసి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండని రేవంత్ ఛాలెంజ్ చేశారు.